మాలీలో సైనిక తిరుగుబాటు

20 Aug, 2020 03:13 IST|Sakshi

బమకో: ఆఫ్రికా దేశం మాలిలో సైనిక తిరుగుబాటు జరిగింది. సైన్య నిర్బంధంతో ప్రస్తుత అధ్యక్షుడు ఇబ్రహీం బౌబకర్‌ కీటా తన పదవికి రాజీనామా చేశారు. దేశంలో చాలా నెలలుగా ఇబ్రహీం దిగిపోవాలని కోరుతూ అందోళనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అకస్మాత్తుగా మంగళవారం సైన్యం తిరుగుబాటు చేసి ఇబ్రహీంను ఇంట్లో నిర్బందించింది. దీంతో ఆయనతోపాటు ప్రధాని బౌబు సిస్సే సైతం రాజీనామా చేశారు.

ఈ పరిణామాలపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నవారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దేశంలో ప్రస్తుతం ఐరాస నేతృత్వంలో 15,600 మంది సైనికులు శాంతిపరిరక్షక విధులు నిర్వహిస్తున్నారు. మాలిలో పరిణామాలపై చర్చించేందుకు ఐరాస భద్రతామండలి సమావేశమైంది. మాలీలో నివాసముంటున్న భారతీయులు ప్రస్తుతానికి ఇళ్లకే పరిమితం కావాలని ఆక్కడి భారత రాయబార కార్యాలయం సూచించింది. అత్యవసర సాయం కావాల్సివస్తే ఎంబసీ హెల్ప్‌లైన్‌కు కాల్‌ చేయాలని ట్విటర్‌లో ప్రకటించింది. 

మరిన్ని వార్తలు