మాజీ భార్యతోపాటు ఆరుగురి కాల్చివేత

19 Feb, 2023 06:04 IST|Sakshi

అమెరికాలో 52 ఏళ్ల వ్యక్తి ఘాతుకం  

ఆర్కాబుతాలా(యూఎస్‌): అమెరికాలో మరో ఘోరం జరిగిపోయింది. ఒంటరితనంతో బాధపడుతున్న ఓ వ్యక్తి తన మాజీ భార్య, సవతి తండ్రితో పాటు మరో నలుగురిని కాల్చి చంపాడు. ఉత్తర మిసిసిపీలో శుక్రవారం ఈ దారుణం చోటుచేసుకుంది. రిచర్డ్‌ డేల్‌ క్రమ్‌(52) తొలుత టెన్నెసీ స్టేట్‌ లైన్‌ సమీపంలోని ఆర్కాబుతాలా దుకాణంలో బయట ఓ వాహనంలో డ్రైవర్‌ సీట్లో కూర్చున్న వ్యక్తిని హ్యాండ్‌గన్‌తో కాల్చేశాడు.

తర్వాత కొద్ది మైళ్ల దూరంలోని ఓ ఇంట్లోకి ప్రవేశించి, అక్కడున్న మాజీ భార్య, ఆమె భర్తపై తూటాల వర్షం కురిపించాడు. మాజీ భార్య మరణించగా భర్త గాయాల పాలయ్యాడు. అనంతరం మరో తన సవతి తండ్రి ఇంట్లోకి దూరి ఆయన్ను, ఆయన సోదరిని అంతం చేశాడు. తర్వాత తాపీగా నడుచుకుంటూ తన ఇంటి వెనుకకు చేరుకున్నాడు. రోడ్డుపై కనిపించిన ఓ వ్యక్తిపై, వాహనంలో కూర్చున్న మరొకరిని కాల్చి చంపాడు. పోలీసులు రంగంలోకి దిగి క్రమ్‌ను అతడి ఇంటి వద్దే అదుపులోకి తీసుకున్నారు. హత్య కేసు నమోదు చేసి జైలుకు తరలించారు. కాల్పుల్లో ఆరుగురు మరణించడం పట్ల అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ప్రథమ మహిళ జిల్‌ బైడెన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. తుపాకీ చట్టాలను సంస్కరించడంపై ఇకనైనా దృష్టి పెట్టాలని కాంగ్రెస్‌కు జో బైడెన్‌ మరోసారి విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు