వైరల్‌: సింహానికే వణుకు పుట్టించాడు

24 Dec, 2020 15:54 IST|Sakshi
సింహంతో పోరాడిన గోట్స్‌ నీఫ్‌

బోట్స్వానా: అడవికి రారాజైన సింహాన్ని చూస్తేనే సగం చస్తాం. అలాంటిది అది నేరుగా మన మీదకు పంజా విసిరితే ఇంకేమైనా ఉందా? ఊహించడానికి కూడా కష్టంగా ఉంది కదూ..! కానీ ఇక్కడ చెప్పుకునే వ్యక్తి దగ్గర మాత్రం సింహం ఆటలు సాగలేవు. ఆకలితో అతడిని చంపుకుని తినాలనుకున్న దాని తల మీద పిడిగుద్దులు కురిపించి సింహానికే వణుకు పుట్టించాడు. అందరినీ ఆశ్చర్యచకితులను చేస్తున్న ఈ సంఘటన ఆఫ్రికా ఖండంలోని బోట్స్వానా దేశంలో జరిగింది. వన్యజాతుల అధ్యయనకారుడు గోట్స్‌ నీఫ్‌.. ఒకవాంగో డెల్టాలో టెంట్‌ వేసుకుని నిద్రిస్తున్నాడు. ఇంతలో ఏదో పెద్ద శబ్ధం అతడికి చేరువ అవుతూ వచ్చింది. అదేంటని లేచి చూసేలోపే సింహం తన ఆకలిని తీర్చుకునేందుకు అతడి మీదకు పంజా విసిరింది. (చదవండి: మీ వెంట లక్షల మందిమి ఉన్నాం: వైరల్‌)

అతడి కేకలు విన్న నీఫ్‌ స్నేహితులు రైనర్‌ వాన్‌ బ్రాండీస్‌, టొమాలెట్స్‌ సెటబోష వారి ప్రాణాలను పణంగా పెట్టి సింహంతో పోరాడారు. చెట్టు కొమ్మలను విసురుతూ, చేతికందిన వస్తువులను విసురుతూ దాన్ని బెదరగొట్టే ప్రయత్నం చేశారు. అయినా సరే అది నీఫ్‌ను వదిలేయకపోవడంతో అతడు దాని ముఖం మీద పిడిగుద్దులు కురిపించాడు. దీంతో ఆగ్రహించిన సింహం అతడి తలను నోట కరుచుకునేందుకు ప్రయత్నించగా చాకచక్యంగా తప్పించుకున్నాడు. కానీ అతడి మోచేతిని మాత్రం తన కోర పళ్లతో కొరకడంతో తీవ్ర గాయమైంది. అయినా సరే నీఫ్‌, అతడి స్నేహితులు ధైర్యంగా సింహంతో పోరాడి దాన్ని అక్కడ నుంచి పారిపోయేలా చేశారు. తీవ్ర గాయాలతో ప్రాణాలతో బతికి బయటపడ్డ నీఫ్‌ ఆస్పత్రిలో చేరగా అతడి మోచేతి ఎముకలు విరిగినట్లు తెలిపారు. డిసెంబర్‌ 7న జరిగిన ఈ ఘటన ఆలస్యంలోకి వెలుగులోకి వచ్చింది. సింహాంతో పోరాడిన నీఫ్‌ను జనాలు ధైర్యశాలి అని మెచ్చుకుంటున్నారు. (చదవండి: ఎలుగుబంటితో యుద్ధం.. చివరికి)

మరిన్ని వార్తలు