పెర్సి సక్సెస్‌.. మార్స్‌ ఫోటోలు షేర్‌ చేసిన నాసా

20 Feb, 2021 14:36 IST|Sakshi
పోటో కర్టెసీ: నాసా రోవర్‌ ‘పర్సవరన్స్’‌ అప్‌లోడ్‌ చేసిన అరుణగ్రహ ఉపరితల ఫోటో

 రోవర్‌ ‘పర్సవరన్స్’‌ అప్‌లోడ్‌ చేసిన ఫోటోలను రిలీజ్‌ చేసిన నాసా

వాషింగ్టన్‌: అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా అరుదైన రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. అరుణ గ్రహంపై జీవం ఆనవాళ్లను గుర్తించేందుకు ఉద్దేశించిన ‘పర్సవరన్స్‌’ రోవర్‌ గురువారం తెల్లవారుజామున విజయవంతంగా ల్యాండ్‌ అయ్యింది. 2020, జూలైలో ప్రారంభమైన ఈ సుదీర్ఘయాత్ర విజయవంతం కావడం అంతరిక్ష శాస్త్రవేత్తలకు శుభవార్తే. ఈ క్రమంలో శుక్రవారం నాసా.. రోవర్‌ ‘పర్సవరన్స్‌’ పంపంచిన అరుదైన ఫోటోలను షేర్‌ చేసింది. 

వీటిలో రోవర్‌ కేబుల్స్‌ సాయంతో అరుణ గ్రహంపై ల్యాండ్‌ అయిన ఫోటో కూడా ఉంది. ల్యాండ్‌ అయ్యే సమయానికి ఆరు ఇంజన్లు ఉన్న ఈ రోవర్‌ తన వేగాన్ని గంటకు 1.7 మైళ్లకు తగ్గించుకుని అరుణగ్రహంపై ల్యాండ్‌ అయినట్లు నాసా వెల్లడించింది. రోవర్‌ అరుణగ్రహం ఉపరితలం మీద ల్యాండ్‌ అయినప్పుడు అక్కడ దుమ్ము లేవడం వీటిల్లో కనిపిస్తుంది అని రోవర్‌ చీఫ్‌ ఇంజనీర్‌ తెలిపారు. 

                                                 ఫోటో కర్టెసీ: నాసా

‘‘రోవర్‌ తన మొట్టమొదటి హై-రిజల్యూషన్, కలర్ ఫోటోను అప్‌లోడ్ చేయగలిగింది. ఇది జెజెరో క్రేటర్‌లో అడుగుపెట్టిన చదునైన ప్రాంతాన్ని చూపిస్తుంది. ఇక్కడ బిలియన్ల సంవత్సరాల క్రితం ఒక నది, లోతైన సరస్సు ఉనికిలో ఉన్నాయనే ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక రెండవ కలర్‌ ఫోటోలో రోవర్ ఆరు చక్రాలలో ఒకటి కనిపిస్తుంది. దాని పక్కనే అనేక రాళ్ళు ఉన్నాయి. ఇవి 3.6 బిలియన్ సంవత్సరాల కన్నా పురాతనమైనవిగా భావిస్తున్నాం’’ అంటూ నాసా ట్వీట్‌ చేసింది.

                                            ఫోటో కర్టెసీ: నాసా

‘‘ఈ రాళ్ళు అగ్నిపర్వత లేదా అవక్షేప మూలాన్ని సూచిస్తాయా అనేది తేలాల్సింది. రోవర్‌ భూమి మీదకు వచ్చినప్పుడు తనతో పాటు తీసుకువచ్చే ఈ రాళ్లను పరీక్షించి అవి ఏ కాలానికి చెందినవి.. ఏ రకానికి చెందినవి అనేది తేలుస్తాం’’ అన్నారు. పర్సవరన్స్‌ గురువారం నాడు కొన్ని ఫోటోలను పంపింది. అవి బ్లాక్‌ అండ్‌ వైట్‌లో ఉన్నాయి. అంత క్లారిటీగా లేవు. ఇప్పుడు వచ్చిన ఫోటోలు చాలా బాగా ఉన్నట్లు నాసా వెల్లడించింది.

చదవండి:
మార్స్‌ పైకి ‘పెర్సీ’
నాసా ప్రయోగం; ఎవరీ స్వాతి మోహన్..?

మరిన్ని వార్తలు