అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో వివాదాలెన్నో!

3 Nov, 2020 13:56 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : అమెరికా అధ్యక్ష పదవికి ఈ రోజు కొనసాగుతున్న ఎన్నికలపై ఒక్క అమెరికా ప్రజల దష్టే కాకుండా యావత్‌ ప్రపంచం దష్టి కేంద్రీకతమైంది. అమెరికా అధ్యక్షుడంటే ఆ ఒక్క దేశానికే కాకుంగా ఈ భూగోళం అంతటికీ శక్తివంతుడన్న నమ్మకమే అందుకు కారణం. అంతటి శక్తివంతుడిని ఎన్నుకునేందుకు జరిగే ఎన్నికలు సాధారణంగా స్వేచ్ఛగా, సజావుగా జరగుతాయని ప్రజలు భావిస్తారు. అక్కడి అధ్యక్ష ఎన్నికలపై వివాదాలు తలెత్తడం, అవకతవకలు జరిగాయని తేలడం కొత్తేమి కాదు. 1960లో జరిగిన ఎన్నికల్లో జాన్‌ ఎఫ్‌ కెన్నడి సంపూర్ణ మెజారిటీతో కాకుండా లక్షకన్నా తక్కువ ఓట్ల తేడాతో విజయం సాధించడం వివాదాస్పదం అయింది.

అప్పటి చికాగో మేయర్‌ రిచర్డ్‌ డలే డెమోక్రటిక్‌ పార్టీ నాయకుడు. కార్మిక సంఘాల్లో, వ్యవస్థీకత నేరాల ముఠాల్లో ఆయనకు మంచి మిత్రులుండేవారని, వారందరి సహకారంతో ఆయన జాన్‌ ఎఫ్‌ కెన్నడికి దొంగ ఓట్లు వేయించారన్నది వివాదం. ‘ముందుగా ఓటేయ్‌. మళ్లీ మళ్లీ ఓటు వేయొచ్చు’ అనే నానుడి అప్పటి అమెరికా పౌరుల్లో ఉండేది. 2000 సంవత్సరంలో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికలు కూడా వివాదాస్పదం తెల్సిందే. నాటి ఎన్నికల్లో జార్జి డబ్లూ బుష్‌ గెలిచారని ప్రజలంతా భావించారు. ఉద్దేశపూర్వకంగా నాటి ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయి. ఫ్లోరిడాకు చెందిన ఎలక్టోరల్‌ కాలేజ్‌  ఓట్లను బుష్‌కు కేటాయించడంలో న్యాయస్థానం జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.

ఫ్లోరిడా ఎలక్టోరల్‌ కాలేజ్‌ ఎన్నికల్లో నాటి రాష్ట్ర ప్రధానాధికారి (స్టేట్స్‌ సెక్రటరీ) కథ్లీన్‌ హారిస్‌ చిత్తశుద్ధితో వ్యవహరించక పోవడం, బుష్‌ తరఫున ఆయన ఫ్లోరిడాలో ప్రచారం చేయడం, అప్పటి ఫ్లోరిడా గవర్నర్‌ జేబ్‌ బుష్, జార్జి డబ్లూ బుష్‌కు స్వయాన సోదరుడవడం కూడా వివాదాస్పం అయింది. ఫ్లోరిడా ఓటర్ల జాబితా నుంచి ‘ఎక్స్‌ ఫెలాన్‌ (గతంలో ఓటు హక్కు రద్దయిన వారు)’ పేరిట 12వేల ఓటర్లను తొలగించడం, ఫ్లోరిడాలోని 67 కౌంటీల ఓట్లను తిరిగి లెక్కించాల్సిందిగా ఫ్లోరిడా సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును ఖాతరు చేయకుండా దేశ సుప్రీం కోర్టు ఎన్నికల ఫలితాలను ప్రకటించాల్సిందిగా ఏకపక్షంగా ఆదేశాలు జారీ చేయడం, ఫ్లోరిడాలోని 25 ఎలక్టోరల్‌ కాలేజీ ఓట్లను బుష్‌కు కేటాయించడంతో అల్‌ గొరేపై బుష్‌ 271–266 ఓట్ల తేడాతో విజయం సాధించారు.

నాడు ప్రజల ఓట్లు అల్‌ గొరేకు 48.4 శాతం, జార్జి బుష్‌కు 47.9 శాతం రావడం గమనార్హం. పాపులర్‌ ఓట్లతో సంబంధం లేకుండా ఎలక్టోరల్‌ కాలేజీ ఓట్లతోనే అధ్యక్ష ఎన్నికలను ఖరారు చేయడం వివాదాస్పదం అవుతూ వస్తోంది. అమెరికాలో రాష్ట్రాలకు ఆయా రాష్ట్రాల జానాభానుబట్టి ఎలక్టోరల్‌ ఓట్ల సంఖ్యను కేటాయిస్తారు. ఏ రాష్ట్రంలో ప్రజల ఓట్లు ఏ అభ్యర్థికి వస్తే ఆ అభ్యర్థికే ఆ రాష్ట్రం ఎలక్టోరల్‌ కాలేజీ ఓట్లను కేటాయిస్తారు. గత అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్‌ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌కు దేశ ప్రజల ఓట్లలో 6,58,44,954 ఓట్లు (48.2 శాతం) రాగా, ట్రంప్‌కు 6,29,79,879 (46.1 శాతం) ఓట్లు వచ్చినప్పటికీ ట్రంప్‌ 306–232 ఎలక్టోరల్‌ కాలేజీ ఓట్ల తేడాతో విజయం సాధించారు. పోస్టల్‌ బ్యాలెట్లలో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు కూడా ఎక్కువగానే ఉన్నాయి.

మరిన్ని వార్తలు