26/11 Attack: పాకిస్తాన్‌.. మీకు మళ్లీ చెబుతున్నాం: భారత్‌

26 Nov, 2021 19:22 IST|Sakshi
(ఫైల్‌ ఫోటో)

సాక్షి, న్యూఢిల్లీ: ముంబై ఉగ్రవాదదాడి గాయాల నుంచి భారతదేశం ఇంకా కోలుకోలేదు. ఈ విషాద ఘటన చోటుచేసుకొని నేటికి 13ఏళ్లు గడుస్తోంది. అయితే ఈ సందర్భంగా భారత విదేశాంగశాఖ.. పాకిస్తాన్‌ హైకమిషన్‌ సీనియర్‌ దౌత్యవేత్తకు ఓ నోట్‌ను విడుదల చేసింది. తమ దేశ నియంత్రణలో ఉన్న భూభాగాల నుంచి భారత్‌కు వ్యతిరేకంగా ఉగ్రదాడులకు అనుమంతించవద్దనే నిబద్దతకు పాక్‌ కట్టుబడి ఉండాలని తెలిపింది. ఈ విషయాన్ని పాకిస్తాన్‌కు మరోసారి తెలుపుతున్నామంటూ భారత విదేశాంగ శాఖ వార్నింగ్‌ ఇచ్చింది. 

13ఏళ్ల క్రితం జరిగిన పాశవిక ఘటనలో ప్రపంచవ్యాప్తంగా 15 దేశాలకు సంబంధించిన 166 కుటుంబాలు బాధితులయ్యాయి. అయితే ఈ ఉగ్రదాడికి పాల్పడినవారిని కోర్టు ముందుకు తీసుకురావటంలో పాకిస్తాన్‌ ఇప్పటికీ తన చిత్తశుద్ధిని చూపించలేదని పేర్కొంది. మరోసారి పాకిస్తాన్‌ ప్రభుత్వాన్ని ఈ ఘటనపై ద్వంద్వ  వైఖరి కట్టిపెట్టి ఉగ్రదాడికి పాల్పడిన నేరస్తులను శిక్షించాలని డిమాండ్‌ చేసింది. ఇది పాకిస్తాన్‌ ప్రభుత్వం జవాబుదారితనం కంటే టెర్రరిస్టుల చేతిలో మృతి చెందిన బాధితుల కుటుంబాలకు సంబంధించిన అంతర్జాతీయ బాధ్యతని గుర్తుచేసింది.

ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు అమరవీరులు, ఇతర బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా చూస్తామని తెలిపింది. 26 నవంబర్‌, 2008లో పది మంది పాకిస్తాన్‌ ఉగ్రవాదుల గ్రూప్‌ భారత్‌లోకి చొరబడి ముంబైలోని రైల్వేస్టేషన్‌, రెండు హోటల్స్‌పై దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు కారకుడైన ఉగ్రవాది అజ్మల్‌ అమీర్‌ కసబ్‌ను 21 నవంబర్‌, 2012లో ఉరితీశారు.

మరిన్ని వార్తలు