రాజుగా చార్లెస్‌–3 పట్టాభిషేకం.. మేఘన్‌-హ్యారీ రాకపై కీలక ప్రకటన

6 May, 2023 13:53 IST|Sakshi

లండన్‌: బ్రిటన్‌ రాజుగా చార్లెస్‌–3 పట్టాభిషేక సంబరానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్‌ అబేలో శనివారం ఆయనకు సంప్రదాయబద్ధంగా కిరీటధారణ చేయనున్నారు. ఇప్పుడు లాంఛనంగా పట్టాభిషేక కార్యక్రమం నిర్వహించనున్నారు. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4.30 గంటలకు ఈ కార్యక్రమం జరుగుతుంది.

అయితే, చార్లెస్‌–3 పట్టాభిషేకం సందర్బంగా అందరి ఫోకస్‌ రాజకుటుంబం మీదే ఉంది. ఈ నేపథ్యంలో, రాచరికాన్ని వదులుకున్న చార్లెస్‌ రెండో కుమారుడు ప్రిన్స్‌ హ్యారీ, ఆయన భార్య మేఘన్‌ మార్కెల్‌ ఈ కార్యక్రమానికి వస్తారా..? లేదా? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కాగా, ఈ విషయంపై బకింగ్‌ హామ్‌ ప్యాలెస్‌ శనివారం ఉదయం కీలక ప్రకటన చేసింది. పట్టాభిషేక మహోత్సవానికి హ్యారీ వస్తున్నట్లు తెలిపింది. అయితే మేఘన్‌ మాత్రం హాజరుకావడం లేదని అధికారికంగా ప్రకటించింది. 

‘రాజు పట్టాభిషేక మహోత్సవానికి డ్యూక్‌ ఆఫ్‌ ససెక్స్‌ ప్రిన్స్‌ హ్యారీ హాజరవుతారు.. కానీ, ప్రిన్స్‌ ఆర్కీ, ప్రిన్సెస్‌ లిలిబెట్‌తో కలిసి డచెస్‌ ఆఫ్‌ ససెక్స్‌ మేఘన్‌ మార్కెల్‌ కాలిఫోర్నియాలోనే ఉండిపోతారు అని ప్యాలెస్‌ ఒక ప్రకటనలో తెలిపింది’. ఇదిలా ఉండగా.. మేఘన్‌-హ్యారీ దంపతులకు ఇద్దరు సంతానం. ఆర్కీ, లిలిబెట్‌. అయితే, రాజు సింహాసనాన్ని అధిష్టించే వారసుల జాబితాలో ఆర్కీ ఆరోస్థానంలో ఉన్నారు. కింగ్‌ చార్లెస్‌ పట్టాభిషేకం రోజునే ఆ చిన్నారికి నాలుగేండ్లు పూర్తవుతాయి.

ఇక, రాజకుటుంబంతో విభేధాల కారణంగా చార్లెస్‌ రెండో కుమారుడు ప్రిన్స్‌ హ్యారీ , ఆయన భార్య మేఘన్‌ మార్కెల్‌ రాజరికాన్ని వదులుకున్నారు. ఈ క్రమంలో 
బ్రిటన్‌ రాజకుటుంబంతో ప్రిన్స్‌ హ్యారీకి విభేధాలు వచ్చిన విషయం తెలిసిందే. భార్య ప్రేమ, వివాహ బంధం కోసం రాచరికాన్ని వదులుకున్న ప్రిన్స్‌ హ్యారీ బ్రిటన్‌ రాజకుటుంబానికి దూరమయ్యారు. ప్రస్తుతం అతను భార్య, పిల్లలతో అమెరికాలో స్థిరపడ్డారు.

మరోవైపు.. చార్లెస్‌–3 పట్టాభిషేక వేడుకలో పాల్గొనేందుకు వివిధ దేశాల అధినేతలు, దేశ విదేశీ అతిథులు లండన్‌కు చేరుకుంటున్నారు. భారత ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ దంపతులు శుక్రవారం లండన్‌కు చేరుకున్నారు. బ్రిటిష్‌ ఎంపైర్‌ మెడల్‌(బీఈఎం) స్వీకరించినవారిని ఈ పట్టాభిషేకానికి ఆహ్వానించారు. ఇలా ఆహ్వానం అందుకున్న వారిలో భారత సంతతికి చెందిన పాకశాస్త్ర ప్రవీణురాలు మంజు మాల్హీ కూడా ఉన్నారు. పట్టాభిషేకం సందర్భంగా జరిగే సైనిక పరేడ్‌లో బ్రిటిష్‌ సైనికులతోపాటు కామన్వెల్త్‌ దేశాల జవాన్లు కూడా పాల్గొంటారు. 7,000 మంది జవాన్లతో జరిగే కవాతు కనువిందు చేయనుంది.

ఇది కూడా చదవండి: వీడియో: రష్యా ప్రతినిధి కవ్వింపు.. ఉక్రెయిన్‌ ఎంపీ పంచ్‌ల వర్షం
 

మరిన్ని వార్తలు