చోక్సికి డొమినికా హైకోర్టు బెయిల్‌ నిరాకరణ

13 Jun, 2021 03:47 IST|Sakshi

డొమినికా: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు ఆర్థిక కుంభకోణంలో నిందితుడు మెహుల్‌ చోక్సికి డొమినికా హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. బెయిల్‌ ఇవ్వడానికి ఆ దేశ హైకోర్టు నిరాకరించింది. బెయిల్‌ మంజూరు చేస్తే చోక్సి దేశం విడిచిపెట్టే అవకాశాలున్నాయన్న ప్రాసిక్యూషన్‌ వాదనతో ఏకీభవించిన కోర్టు బెయిల్‌ పిటిషన్‌ను తిరస్కరించినట్టుగా స్థానిక మీడియా వెల్లడించింది. డొమినికాతో చోక్సికి  సంబంధ బాంధవ్యాలు లేవని, అతనిపై కోర్టు కూడా ఎలాంటి ఆంక్షలు, షరతులు విధించలేదని న్యాయమూర్తి ఆడిరిన్‌ రాబర్ట్స్‌ వ్యాఖ్యానించారు.   

వెనక్కి రప్పించడానికి భారత్‌ ప్రయత్నాలు  
చోక్సిని భారత్‌కు వెనక్కి రప్పించడానికి విదేశాంగ శాఖ, కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)లు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. డొమినికా న్యాయస్థానంలో విదేశాంగ శాఖ, సీబీఐ రెండు వేర్వేరు ఇంప్లీడ్‌ పిటిషన్లను దాఖలు చేశాయి. చోక్సి పరారీలో ఉన్న ఆర్థిక నేరస్తుడు అన్న అంశాన్ని సాక్ష్యాలతో సహా నిరూపించడానికి సీబీఐ పకడ్బందీగా అన్ని అంశాలను తన పిటిషన్‌లో జతపరిచింది. మరోవైపు విదేశాంగ శాఖ చోక్సి భారతీయుడన్న విషయాన్ని కోర్టులో రుజువు చేసే సాక్ష్యాలను అఫిడవిట్‌ రూపంలో దాఖలు చేసింది. చోక్సి మాత్రం తాను భారతీయ పౌరసత్వాన్ని వదులుకున్నానని, ప్రస్తుతం తాను ఆంటిగ్వా పౌరుడునని వాదిస్తున్నారు. 

మరిన్ని వార్తలు