మయన్మార్‌: 9 మందిని కాల్చి చంపిన సైన్యం

19 Mar, 2021 16:58 IST|Sakshi
పోలీసులపై సీసా విసురుతున్న నిరసనకారుడు

మయన్మార్‌ : ప్రజా ప్రభుత్వాన్ని కూలదోసి అధికారంలోకి వచ్చిన సైనిక ప్రభుత్వం ఆగడాలు రోజురోజుకు పెచ్చు మీరుతున్నాయి. ఆంగ్‌ సాన్‌ సూకీ ప్రజా ప్రభుత్వానికి మద్ధతుగా వెల్లు వెత్తుతున్న నిరసనలను అణగదొక్కటానికి సైనిక బలగాలు దారుణానికి పాల్పడుతున్నాయి. శుక్రవారం ఆంగ్‌బాన్‌ సెంట్రల్‌ టౌన్‌ వద్ద సైనిక బలగాలు కాల్పులకు తెగబడ్డాయి. నిరసనకారులపై విచక్షణా రహితంగా కాల్పులు జరపటంతో 9 మంది మృత్యువాతపడ్డారు. ఎనిమిది మంది అక్కడికక్కడే చనిపోగా.. ఓ వ్యక్తి కలావ్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. దేశంలో నెలకొన్న హింసకు స్వప్తి పలకాలని ఇండోనేషియా పిలుపునిచ్చిన రోజే ఈ దారుణం చోటుచేసుకోవటం గమనార్హం.

కాగా, ఫిబ్రవరి నెలలో మయన్మార్‌ ప్రధాని ఆంగ్‌ సాన్‌ సూకీ ప్రభుత్వాన్ని కూలదోసి సైన్యం అధికారాన్ని హస్తగతం చేసుకున్న సంగతి తెలిసిందే. సైనిక పాలనకు వ్యతిరేకంగా అప్పటినుంచి ప్రజలు ఉద్యమం చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా నిరసన జ్వాలలు వెల్లు వెత్తుతూనే ఉన్నాయి. నిరసనలను అదుపు చేసే నెపంతో సైనిక బలగాలు ప్రజల్ని పొట్టన పెట్టుకుంటున్నాయి. సైన్యం ఇప్పటి  వరకు 150 మందికిపైగా నిరసనకారుల్ని చంపేసింది.  

చదవండి : సూకీకి 5 లక్షల డాలర్లు లంచమిచ్చా

మరిన్ని వార్తలు