గూగుల్‌ గుత్తాధిపత్యంపై అమెరికాలో కేసు

21 Oct, 2020 08:00 IST|Sakshi

వాషింగ్టన్‌: ఆన్‌లైన్‌ సెర్చి, అడ్వర్టైజింగ్‌లో ఆధిపత్యాన్ని దుర్వినియోగం చేసిందని టెక్‌ దిగ్గజం గూగుల్‌పై అమెరికా న్యాయ శాఖ దావా వేసింది. పోటీ సంస్థలను దెబ్బతీసేందుకు, వినియోగదారులకు హాని చేసేందుకు తన గుత్తాధిపత్యాన్ని ఉపయోగించుకుందని ఆరోపించింది. ‘గూగుల్‌ అనేది ఇంటర్నెట్‌కు ప్రధాన ద్వారంలాంటిది. సెర్చి అడ్వరై్టజింగ్‌ దిగ్గజం. అయితే, పోటీ సంస్థలకు హానికరమైన అనుచిత విధానాలతో తన గుత్తాధిపత్యాన్ని దుర్వినియోగం చేసింది‘ అని అమెరికా డిప్యూటీ అటార్నీ జనరల్‌ జెఫ్‌ రోసెన్‌ తెలిపారు. టెక్నాలజీ పరిశ్రమలో ఇలాంటి కేసులను సత్వరం పరిష్కరించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ఫోన్లలో గూగుల్‌ను డిఫాల్ట్‌ సెర్చి ఇంజిన్‌లా ఉంచేందుకు మొబైల్‌ ఫోన్ల తయారీ సంస్థలకు గూగుల్‌ భారీగా చెల్లింపులు జరుపుతోందని, ఇందుకోసం ప్రకటనకర్తల నుంచి వచ్చే నిధులను వెదజల్లుతోందని పిటీషన్‌లో న్యాయశాఖ ఆరోపించింది. 11 రాష్ట్రాలు కూడా ఈ పిటిషన్‌లో భాగంగా చేరాయి. మరోవైపు, న్యాయ శాఖ దావా లోపభూయిష్టమైనదని గూగుల్‌ వ్యాఖ్యానించింది.

మరిన్ని వార్తలు