హైస్కూల్‌లో కాల్పుల కలకలం.. ఇద్దరు మృతి.. నిందితుడ్ని షూట్ చేసిన పోలీసులు

25 Oct, 2022 09:19 IST|Sakshi

అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. మిస్సోరిలోని సెయింట్ లూయిస్‌ హైస్కూల్‌లో ఓ సాయుధుడు తుపాకీతో రెచ్చిపోయాడు. విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. అమెరికా కాలమానం ప్రకారం సోమవారం ఉదయం ఈ ఘటన జరిగింది.

సమాచారం అందుకున్న పోలీసులు తక్షణమే స్పందించి ఘటనా స్థలానికి చేరుకున్నారు. కాల్పులకు పాల్పడిన నిందితుడిని షూట్ చేశారు. అనంతరం క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అయితే నిందితుడు సహా మరో ఇద్దరు బాధితులు అప్పటికే మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. మృతుల్లో ఓ మహిళ, ఓ టీనేజర్ ఉన్నారు.

ఉదయం 9:10 గంటలకు తమకు కాల్పులు జరుగుతున్నట్లు ఫోన్ వచ్చిందని పోలీసులు చెప్పారు. 2 నిమిషాల్లోనే ఘటనా స్థలానికి చేరుకున్నట్లు పేర్కొన్నారు. స్కూల్‌ లోపల పెద్ద తుపాకీతో ఓ దుండగుడు కాల్పులు జరుపుతున్నట్లు విద్యార్థులు తమకు తెలిపారని, వెంటనే అతడ్ని షూట్ చేసినట్లు చెప్పారు. నిందితుడి వయసు 20 ఏళ్లు పైబడి ఉంటుందని, అతడి వివరాలు తెలియాల్సి ఉందని వివరించారు.
చదవండి: ఓడలో భారీ అగ్నిప్రమాదం.. 14 మంది సజీవదహనం.. 226 మందిని..

మరిన్ని వార్తలు