వాషింగ్టన్ : కరోనా కట్టడి చేసే వ్యాక్సిన్ ప్రయోగంలో కీలక ముందడుగు పడింది. అమెరికాకు చెందిన మెడెర్నా కంపెనీ తయారు చేస్తోన్న వ్యాక్సిన్ను ప్రయోగించిన కోతులపై సానుకూల ఫలితాలు వచ్చాయి. కోతులపై వేర్వేరు స్థాయి మోతాదులో ప్రయోగించగా కేవలం రెండు రోజుల్లోనే అవి కోలుకున్నాయని మెడెర్నా జర్నల్ ఆఫ్ మెడిసిన్ మంగళవారం తెలిపింది. ఇది కరోనా కట్టడిలో మానవులపై చేసే ప్రయోగానికి కీలక దశ అని పేర్కొంది. (కీలక దశలో క్లినికల్ ట్రయల్స్)
అధ్యయన ఫలితాల ప్రకారం..టీకా ప్రయోగించిన రెండు రోజుల్లోనే వైరల్ రెఫ్లికేషన్ కనపడలేదని తెలిపింది. చాలా మెరుగ్గా కోతులు కోలుకున్నాయని, ఈ టీకా మానవుల్లో కూడా మంచి ఫలితాలను రాబడుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది. తమ వ్యాక్సిన్ పరీక్షలు విజయవంతమైతే అక్టోబర్ నాటికి రెగ్యులేటరీ అనుమతులు పొంది సంవత్సరాంతానికి 5 కోట్ల మందికి రెండు డోసుల వ్యాక్సిన్లను సరఫరా చేస్తామని వెల్లడించింది. ఇందుకోసం అవసరమైన డోసులను సిద్ధం చేసినట్లు మోడెర్నా తెలిపింది. ఈ వ్యాక్సిన్ పరీక్షలను మార్చిలోనే ప్రారంభించగా తొలుత 45 మంది వాలంటీర్లపై ప్రయోగించింది. అందులో సానుకూల ఫలితాలు వచ్చినట్లు సమాచారం.
సుమారు 30వేల రోగులపై మోడెర్నా మూడవ దశ క్లినికల్ ట్రయల్స్ జరగనున్నాయి. వ్యాక్సిన్ పరీక్షల కోసం దాదాపు 1,50,000 మంది అమెరికన్లు స్వచ్ఛందంగా తమ పేర్లు నమోదు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. అమెరికా నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్, మోడెర్నా కంపెనీ సంయుక్తంగా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ను అభివృద్ధి చేస్తున్నారు. మోడెర్నా ఇప్పటికే దేశవ్యాప్తంగా ఏడు ట్రయల్ సైట్లలో వ్యాక్సిన్లు వేసినట్లు తెలిపింది. మొదటిసారిగా జారియాలోని సవన్నాలో వ్యాక్సిన్ వేసినట్లు వెల్లడించింది. అంతేకాక వీరిలో కొందరికి అసలు వాక్సిన్, మరి కొందరికి డమ్మీ వెర్షన్ ఇవ్వనున్నారు. ప్రస్తుతం భారీ ఎత్తున నిర్వహించే పరీక్షలతో వ్యాక్సిన్ అసలు సామర్థ్యం బయటపడే అవకాశముందంటున్నారు నిపుణులు. టీకా అభివృద్ధికి నిధులు సమకూర్చేందుకు అమెరికా ప్రభుత్వం 955 మిలియన్ డాలర్లను ప్రకటించింది. (ముప్పై వేల మందిపై ప్రయోగానికి సిద్ధమైన అమెరికా)