‘ఏలియన్స్‌ వచ్చి తీసుకెళ్లాయేమో’

30 Nov, 2020 14:39 IST|Sakshi

ఉటా ఎడారిలో మాయమైన లోహపు దిమ్మె

వాషింగ‍్టన్‌: అమెరికాలోని ఉటా ఎడారిలో కొద్ది రోజుల క్రితం ఓ వింత వస్తువు ప్రత్యక్షమయిన సంగతి తెలిసిందే. 12 అడుగుల పొడవున్న ఈ లోహపు దిమ్మె నర సంచారం లేని ఆ ఎడారిలోకి ఎలా వచ్చేందనే విషయం ఇంకా మిస్టరీగానే ఉండగా... తాజాగా మరో వింత చోటు చేసుకుంది. ప్రస్తుతం ఉటా ఎడారిలో ప్రత్యక్షమైన ఆ దిమ్మె కనిపించకుండా పోయింది. దాంతో తప్పకుండా ఇది ఏలియన్స్‌ పనే అంటున్నారు నెటిజనులు. ఈ నేపథ్యంలో ల్యాండ్‌ మేనేజ్‌మెంట్‌ బ్యూరో అధికారులు ‘ఒక్కరు లేదా కొందరు వ్యక్తులు కలిసి ఈ దిమ్మెను శుక్రవారం రాత్రి తొలిగించినట్లు మాకు తెలిసింది’ అన్నారు. ఈ మేరకు వారు ఓ ప్రకటన విడుదల చేశారు. దాని ప్రకారం.. ‘లోహపు దిమ్మెను తొలగించారు. బ్యూరో ఆఫ్‌ ల్యాండ్‌ మేనేజ్‌మెంట్‌లో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు అక్రమంగా పాతిన లోహపు దిమ్మెను తొలగించినట్లు మా దగ్గర ఖచ్చితమైన సమాచారం ఉంది’ అని దానిలో పేర్కొన్నారు. ఈ నిర్మణాన్ని తొలగించినట్లు ఉటా హైవే పాట్రోల్‌ సీపీఎల్‌ అధికారి ఒకరు ఆదివారం వాషింగ్టన్‌ పోస్ట్‌కు తెలియజేశారు. అయితే ఎవరు దాన్ని తొలగించారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. ప్రస్తుతం ఈ విషయం జనాలను ఆశ్చర్యంలో ముంచెత్తుతుంది. (చదవండి: ఏముంది.. అక్కడే పడుకో: భార్య)

‘అసలు ఆ దిమ్మెను ఎడారిలో ఎవరు నిలబెట్టారు.. ఇప్పుడు ఎవరు తొలగించారు. అంతా మాయాలా ఉంది’ అంటూ ఆశ్చర్యం వ్యక్యం చేస్తున్నారు జనాలు. ప్రస్తుతం దీని గురించి ఇంటర్నెట్‌లో తెగ చర్చ నడుస్తోంది. ‘ఏలియన్స్‌ వచ్చి దాన్ని తీసుకెళ్లాయి’.. ‘ఇప్పుడు ఆ దిమ్మె మరో చోట ప్రత్యక్షం అవుతుందేమో’.. ‘ఆ దిమ్మె ఏలియన్స్‌కు సంబంధించిన వస్తువు. అందుకే అధికారుల సీక్రేట్‌గా దాన్ని తొలగించారు.. దాని ఏం మాట్లాడటం లేదు’ అంటూ నెటిజనులు కామెంట్‌ చేస్తున్నారు. ఈ నెల 18న కొందరు కార్మికులు ఈ నిర్మణాన్ని గమనించారు. రెడ్‌ రాక్‌ రిమోట్‌ ఏరియాలో దిమ్మె ప్రత్యక్షం అ‍య్యిందని తెలిపారు. నాటి నుంచి ఈ దిమ్మె తెగ వైరలయ్యింది. ఇక ఈ దిమ్మె ఎక్కడ ఉంది అనే దాని గురించి ఉటా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ సేఫ్టీ వాళ్లు ఖచ్చితమైన సమాచారాన్ని ఇవ్వలేదు. ఎందుకంటే ప్రజలు పెద్ద సంఖ్యలో అక్కడకు వచ్చే అవకాశం ఉండటంతో సమాచారాన్ని గోప్యంగా ఉంచారు.

మరిన్ని వార్తలు