మూసేసిన స్కూల్‌లో 215 మంది పిల్లల అస్థిపంజరాలు లభ్యం

30 May, 2021 18:13 IST|Sakshi
కమ్లూప్స్ ఇండిజీనియస్‌ రెసిడెన్షియల్ స్కూల్‌, కెనడా

ఒట్టోవా: కెనడాలో దారుణం చోటుచేసుకుంది. ప్రఖ్యాత కమ్లూప్స్ ఇండిజీనియస్‌ రెసిడెన్షియల్ స్కూల్‌లో సుమారు 215 మంది పిల్లల అస్థిపంజరాలు బయటపడడం కలకలం రేపింది. కాగా 1978లోనే ఈ పాఠశాలను మూసేశారు. తాజాగా బయటపడిన అవశేషాల్లో ఎక్కువ మంది మూడేళ్ల లోపు పిల్లలే ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. భూమిలోకి చొచ్చుకుపోయే ఒక ప్రత్యేకమైన రాడార్‌ సాయంతో పిల్లల అస్థిపంజరాలను గుర్తించినట్లు తెలిపారు. ఈ ఘటనపై కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో విచారం వ్యక్తం చేశారు. దేశ చరిత్రలోనే ఇది చాలా బాధకరమైన సంఘటన అని.. సిగ్గుతో తల దించుకోవాల్సిన రోజని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

కాగా 2015లో ట్రూత్‌ అండ్‌ రీకాన్సిలేషన్‌ అనే ఒక కమిటీ ఈ స్కూల్‌పై అధ్యయనం చేపట్టింది. ఆ రిపోర్టులో విస్తుపోయే విషయాలు వెలుగుచూడడం అప్పట్లో సంచలనంగా మారింది. 1840 నుంచి 1978 మధ్యలో పిల్లలను తల్లిదండ్రుల నుంచి బలవంతంగా వేరు చేసి క్రిస్టియన్‌ చర్చిలు ఆధ్వర్యంలో నడుసున్న కమ్లూప్స్‌ పాఠశాలలో చేర్పించేవారు. అలా దాదాపు 150,000 మంది పిల్లల్లో చాలామందిని శారీరక వేధింపులతో పాటు లైంగింకగా వేధించడం, సరిగ్గా ఆహారం ఇవ్వకపోవడం లాంటి దురాగతాలకు పాల్పడేవారని ఒక రిపోర్టులో బయటపడింది. స్కూల్‌ యాజమాన్యం ఆగడాలతో దాదాపు 3200 మంది చనిపోయారని.. అందులో 215 మంది పిల్లలను స్కూల్‌ గ్రౌండ్‌లోనే ఖననం చేసినట్లు తేలింది.


చిన్నపిల్లల మృతికి సంతాపంగా నివాళి ప్రకటిస్తున్న కెనడా ప్రజలు

అయితే  2008లో కెనడా ప్రభుత్వం అప్పట్లో ఈ ఘటనపై క్షమాపణలో కోరింది. ఇక ఈ విషయంపై 2015 నుంచి  ఆరేళ్లుగా దీనిపై దర్యాప్తు కొనసాగుతుందని అధికారులు పేర్కొన్నారు. బ్రిటీష్‌ కొలంబియా కార్యాలయంతో కలిసి విచారణ చేస్తున్నామని.. బయటపడ్డ పిల్లల అస్థిపంజరాలను భద్రపరుస్తామని వారు తెలిపారు.   
చదవండి: ప్రియురాలితో బోరిస్​ రహస్య వివాహం!

అమ్మ, నాన్న ఎక్కడ.. కంటతడి పెట్టిస్తున్న చిన్నారి

మరిన్ని వార్తలు