నెటిజన్‌ బిత్తిరి పని.. డొనాల్డ్‌సన్ చనిపోయాడంటూ ట్వీట్‌.. లక్ష మంది లైక్‌.. చివర్లో ట్విస్ట్‌

22 Mar, 2023 11:02 IST|Sakshi

సోషల్‌ మీడియాలో వ్యాప్తి చెందే వార్తలన్నీ నిజాలు కావు. అత్యుత్సాహంతో కొందరు నిజా నిజాలు నిర్ధరించుకోకుండా ఫేక్ వార్తలను గుడ్డిగా షేర్ చేస్తుంటారు. ఫలితంగా అమాయకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. తాజాగా అలాంటి ఘటనే జరిగింది.

నెం.1 యూట్యూబ్ స్టార్‌గా గుర్తింపు ఉన్న మిస్టర్ బీస్ట్(అసలు పేరు జిమ్మీ డోనాల్డ్‌సన్‌) చనిపోయాడనే ఓ వార్త సామాజిక మాధ్యమాలను షేక్ చేసింది. 'డొనాల్డ్‌సన్ చనిపోయాడు. దీన్ని నమ్మలేకపోతున్నా. అతను ఇంత తర్వగా వెళ్లిపోతాడని ఊహించలేదు. ఈ లెజెండ్ ఎప్పటికీ గుర్తుండిపోతాడు' అని ఓ యూజర్ ట్విట్టర్‌లో పోస్టు చేశాడు. డొనాల్డ్ సన్ ఫొటోను కూడా షేర్ చేయడంతో ఈ పోస్టు క్షణాల్లోనే వైరల్‌గా మారింది.

దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందించారు. ఇది కచ్చితంగా ఫేక్. ఇలాంటి న్యూస్ షేర్ చేసేవారికి అసలు బుద్ధిలేదు. అది అసహ్యం తెప్పించే జోక్‌లా ఉంది. అని ఓ యూజర్ ఘాటుగా రిప్లై ఇచ్చాడు. మరికొందరు మాత్రం మిస్టర్ బీస్ట్‌ నిజంగానే చనిపోయాడనుకుని నమ్మారు. ఇది నిజమా? ఇలా జరుగుతుందని అసలు ఊహించలేదు అని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇంకొందరేమో ఇలాంటి సున్నితమైన విషయాలపై ఫేక్ న్యూస్ ఎలా వ్యాప్తి చేస్తారు? అలాంటి వారిపై ఎలాంటి చర్యలు తీసుకోరా? అని ప్రశ్నించారు.

ఏదేమైనా మిస్టర్ బీస్ట్ చనిపోయాడనే పోస్టును 1.4 కోట్ల మంది వీక్షించారు. లక్ష మందికిపైగా లైక్ చేశారు. దీంతో డొనాల్డ్‌సన్ దీనిపై స్వయంగా స్పందించాడు. ఈ పోస్టును లక్ష మంది ఎందుకు లైక్ చేశారో నాకు అర్థం కావడం లేదంటూ నవ్వులు పూయించాడు.

అయితే డొనాల్డ్‌సన్ చనిపోయాడని పోస్టు పెట్టిన వ్యక్తి దీనికి మళ్లీ రియాక్ట్ అయ్యాడు. నా పోస్టుకు రిప్లై ఇవ్వడానికే అతను మళ్లీ తిరిగివచ్చాడు అని చమత్కరించాడు. 10 వేల డాలర్లు (సుమారు రూ. 8,30,000) ఇస్తే ఈ పోస్టును డిలీట్ చేస్తా అ‍న్నాడు. కానీ డొనాల్డ్‌సన్ దీనిపై మళ్లీ స్పందించలేదు. దీంతో ఆ పోస్టు అలానే ఉంది. కాగా.. మిస్టర్ బీస్ట్‌ పేరుతో ఉన్న డొనాల్డ్‌సన్ యూట్యూబ్ ఛానల్‌కు అత్యధికంగా 13.7కోట్ల మంది సబ్‌స్కైబర్లు ఉన్నారు.
చదవండి: గుండె ధైర్యమంటే నీదే భయ్యా.. మైండ్‌ బ్లాంక్‌ ఇదేనేమో..

మరిన్ని వార్తలు