హృదయవిదారకం: పాలిస్తూ చంటి బిడ్డపై కూలిన తల్లి..

7 May, 2021 20:47 IST|Sakshi
మరియానా, చంటి బిడ్డ

అర్జెంటీనా : ఓ తల్లి హఠాత్మరణం చంటి బిడ్డ ప్రాణం తీసింది. బిడ్డకు పాలిస్తూ చనిపోయిన తల్లి.. బిడ్డపై పడటంతో చిన్నారి కూడా కన్నుమూసింది. ఈ విషాదకర సంఘటన అర్జెంటీనాలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలు.. అర్జెంటీనాలోని కోర్రియెంట్స్‌కు చెందిన మరియానా ఒజేడా (30)కు ముగ్గురు పిల్లలు. వీరిలో నెలల చంటి బిడ్డ కూడా ఉంది. కొద్దిరోజుల క్రితం మరియానా భర్త ఆఫీసు వెళ్లాడు. పెద్ద కూతురు అమ్మమ్మ ఇంటికి వెళ్లింది. కుమారుడు, చంటి బిడ్డతో ఆమె ఇంట్లోనే ఉండిపోయింది. మధ్యాహ్నం మరియానా బిడ్డకు పాలిస్తోంది. ఈ నేపథ్యంలో హైబీపీతో హఠాత్తుగా బిడ్డపై కుప్ప కూలి కన్నుమూసింది. తల్లి నేరుగా ముఖంపై పడటంతో ఊపిరాడక చంటిపాప కూడా మరణించింది.

ఆమె భర్త గేబ్రియల్‌ ఇంటికి ఫోన్‌ చేయగా ఫోన్‌ రింగవుతున్నా ఎంతసేపటికీ ఎవరూ లిఫ్ట్‌ చేయలేదు. కొద్దిసేపటి తర్వాత ఫోన్‌ లిఫ్ట్‌ చేసిన కుమారుడు.. తల్లి నిద్రపోతోందని తండ్రికి చెప్పాడు. దీంతో అనుమానం వచ్చిన గేబ్రియల్‌ వెంటనే ఇంటికి వెళ్లాడు. బెడ్డుపై జీవచ్ఛవాల్లా పడి ఉన్న భార్య, బిడ్డను గుర్తించాడు. ఆ వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తల్లి,బిడ్డ శరీరాలపై ఎటువంటి గాయాలు లేవని పోలీసులు తెలిపారు.    

మరిన్ని వార్తలు