కొడుకుపై ప్రేమ: 2 వంతెనలు నిర్మిస్తోన్న తల్లి

6 Jun, 2021 11:32 IST|Sakshi

కొందరి ఆత్మీయతలు, అనురాగాలు.. ఆదర్శాలుగా మారి చరిత్రలో నిలిచిపోతాయి. ఎంతో మంది జీవితాలను నిలబెడతాయి. అందుకు చైనాకు చెందిన మిస్సెస్‌ మెంగ్‌ ఓ నిదర్శనం. హెనెన్‌ ప్రావిన్స్‌ నివాసి అయిన ఆమె తన కొడుకుపై ప్రేమతో.. ఏకంగా 154,000 యువన్‌ (రూ.1.10 కోట్లు) ఖర్చు పెట్టి రోడ్డు దాటడానికి 2 వంతెనలు నిర్మిస్తోంది. ఎందుకంటే కొడుకు స్కూల్‌కి వెళ్లివచ్చే మార్గం.. నిత్యం ట్రాఫిక్‌తో రద్దీగా ఉంటుంది. దాన్ని దాటేందుకు కనీసం ట్రాఫిక్‌ సిగ్నల్స్, స్పీడ్‌ బేకర్స్‌ లాంటి జాగ్రత్తలేమీ లేవు.  పైగా ఆ రోడ్డంతా ఎప్పుడూ నీళ్లతో నిండి ఉంటుంది.

అక్కడ ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జ్‌ నిర్మించాలని అధికారులను  కోరినా ఫలితం లేకుండా పోయింది. దాంతో ఆమే స్వయంగా రెండు ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జ్‌ల నిర్మాణం చేపట్టింది. అధికారుల వద్ద అనుమతి తీసుకుంది. ప్రస్తుతం ఒక వంతెన పూర్తి కాగా, మరొకటి పునాది స్థాయిలో ఉంది. ఆ బ్రిడ్జ్‌కి ‘విజ్డమ్‌ బ్రిడ్జ్‌’ (వివేకమైన వంతెన) అని పేరు పెట్టింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘ప్రతిరోజూ నా  కొడుకు స్కూల్‌ నుంచి తిరిగి వచ్చే వరకూ  టెన్షన​గా గడిపేదాన్ని. ఇప్పుడు నిశ్చింతగా ఉంది.

నేను చచ్చిపోయేలోపు  బోలెడంత డబ్బు పోగేసుకోవాలని కానీ, నా కొడుక్కోసం  తరగనంత ఆస్తి కూడబెట్టాలని కానీ నాకు లేవు.  అందుకే ఈ పని చేయగలిగాను’ అని తేల్చింది. అమ్మ మమతను చూపించింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. విషయం తెలుసుకున్న నెటిజనులు ఆమెకు సలాం కొడుతున్నారు. కొడుకు గురించి ఆమె  చేసిన మంచిపని.. మిగతా పిల్లలకూ ఉపయోగపడుతుందని, వాళ్లంతా ఆమెకు రుణపడి ఉండాలని అంటున్నారు.  
చదవండి: మగ స్నేహితులనే  తోడిపెళ్లికూతుళ్లుగా మార్చేసింది

మరిన్ని వార్తలు