ఇతర గ్రహలకు జీవుల రవాణా మరింత ఈజీ కానుందా..!

14 Jun, 2021 17:40 IST|Sakshi

నాసాతో పాటు పలు అంతరిక్ష సంస్థలు ఇతర గ్రహలకు మానవులను పంపడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. తాజాగా చేసిన పరిశోధనలతో జీవరాశుల రవాణా ఇతర గ్రహలకు మరింత సులువుకానున్నట్లు జపాన్‌ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అందుకోసం జపాన్‌ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. కాగా కొన్ని నెలలపాటు అంతరిక్షంలో అత్యధిక మోతాదులో కాస్మిక్‌ రేడియేషన్‌కు గురైన ఎలుకల వీర్యంతో భూమిపై ఎలుక పిల్లలను మొదటిసారిగా సృష్టించారు. ఇంటర్నేషనల్‌ స్పేస్‌ స్టేషన్‌లో సుమారు ఆరు సంవత్సరాల పాటు కాస్మిక్‌ రేడియేషన్‌కు ఎలుకల వీర్యం గురైంది. ఈ విషయాన్ని సైన్స్‌ అడ్వాన్స్‌లో జూన్‌ 11 న పబ్లిష్‌ చేశారు.  ఐఎస్‌ఎస్‌లో ఫ్రిజ్‌ డ్రై ఫాంలో సుమారు ఆరు సంవత్సరాలపాటు నిలువ చేసిన  ఎలుకల వీర్యంతో భూమిపై 168 ఎలుకలను ఐవిఎఫ్‌తో సృష్టించారు. కాగా ఎలుకల్లో ఎలాంటి జన్యుపరమైన సమస్యలు లేకపోవడం గమనార్హం. 

జీవశాస్త్రవేత్త, నివేదిక ప్రధాన రచయిత తెరుహికో వాకాయమా మాట్లాడుతూ..అంతరిక్ష వీర్యంతో ఫలదీకరణం చేయబడిన ఎలుకల మధ్య, భూగ్రహంపై ఫలదీకరణం చెందిన ఎలుకలకు పెద్దగా తేడా ఏమి లేదని తెలిపారు. స్పేస్‌లో ఉన్న వీర్యంతో ఏర్పడిన ఎలుకలు సాధారణ రూపానే కల్గి ఉన్నాయని, అంతేకాకుండా వాటిలో జన్యుపరంగా ఎలాంటి మార్పులు లేవని పేర్కొన్నారు. 2013లో జపాన్‌లోని యమనాషి విశ్వవిద్యాలయంలోని వాకాయమా అతని సహచరులు దీర్ఘకాలిక అధ్యయనం కోసం మూడు బాక్సులతో కూడిన ఫ్రీజ్డ్‌ డ్రైడ్‌ వీర్యాన్ని ఐఎస్‌ఎస్‌కు పంపారు.అంతరిక్షంలో రేడియేషన్‌కు దీర్ఘకాలికంగా గురికావడంతో  పునరుత్పత్తి కణాలలో డీఎన్‌ఏ దెబ్బతింటుందా..! అలాగే ఫలదీకరణ విషయాలపై పరిశోధన చేయాలని భావించారు. 

భవిష్యత్తులో, ఇతర గ్రహాలకు వలస వెళ్లే సమయం వచ్చినప్పుడు, మానవులకు మాత్రమే కాకుండా, పెంపుడు జంతువులకు కూడా జన్యు వనరుల వైవిధ్యాన్ని మనం గుర్తించాల్సిన అవసరం ఉందని వాకాయమా తన నివేదికలో తెలిపారు. ఈ విధంగా చేయడంతో ఇతర గ్రహల్లో మానవుల, జంతువులను సంఖ్యను పెంచడానికి ఉపయోగపడుతుందనీ పేర్కొన్నారు. ఇతర గ్రహాలకు సజీవ జంతువులను, మానవులను పంపే దానిలో భాగంగా రవాణా ఖర్చు గణనీయంగా తగ్గుతుందనీ వాకాయమా తమ నివేదికలో తెలిపారు.

చదవండి: మరో కొత్త గ్రహన్ని గుర్తించిన నాసా..అచ్చం భూమిలాగే..!

మరిన్ని వార్తలు