మయన్మార్‌ ఆర్మీ సంచలన నిర్ణయం: ప్రజలకు న్యూఇయర్‌ గిఫ్ట్‌

18 Apr, 2021 01:22 IST|Sakshi

ఖైదీలకు క్షమాభిక్ష పెట్టిన మయన్మార్‌ ఆర్మీ

యాంగూన్‌: మయన్మార్‌లో సంప్రదాయ తింగ్యాన్‌ కొత్త సంవత్సర సెలవు సందర్భంగా జైళ్లలో ఉన్న 23 వేల మందికి పైగా నిరసన కారుల క్షమాభిక్ష పెట్టి, వారిని విడుదల చేసినట్లు మయన్మార్‌ ఆర్మీ ప్రకటించింది. అయితే ఫిబ్రవరిలో అధికారాన్ని చేజిక్కించు కున్న నాటి నుంచి అరెస్టయిన వారిని అందరినీ విడుదల చేసిందో లేదో మాత్రం స్పష్టంగా వెల్లడించలేదు.

ఆర్మీ సీనియర్‌ జనరల్‌ మిన్‌ ఆంగ్‌ లైంగ్‌ మొత్తం 23,047 మందికి క్షమాభిక్ష పెట్టారని, అందులో 137 మంది విదేశీయులు కూడా ఉన్నారని అక్కడి ప్రభుత్వ మీడియా ఎమ్‌ఆర్‌టీవీ తెలిపింది. విడుదలైన విదేశీయులను అక్కడి నుంచి పంపించే ఏర్పాట్లు చేయనున్నట్లు పేర్కొంది. యాంగూన్‌లోని ఇన్సేన్‌ కారాగారం నుంచి వీరంతా విడుదలవుతున్నట్లు ప్రకటించింది. ఆన్‌లైన్‌లో పెట్టిన పోస్టులకు సైతం పలువురుని ఆర్మీ అరెస్టు చేసింది. అయితే ఇప్పుడు విడుదలైన వారిలో వారున్నారో లేదో ఇంకా తెలియలేదు. ఆర్మీ దేశాధికారం అందుకున్న నాటి నుంచి ఇలా ఖైదీలను విడుదల చేయడం ఇది రెండోసారి. 

>
మరిన్ని వార్తలు