సూకీపై కొత్తగా అక్రమ వాకీటాకీల కేసు

4 Feb, 2021 03:45 IST|Sakshi

యాంగాన్‌: మయన్మార్‌ ప్రజాస్వామ్య ఉద్యమ నేత, నేషనల్‌ లీగ్‌ ఫర్‌ డెమొక్రసీ(ఎన్‌ఎల్‌డీ) అధ్యక్షురాలు ఆంగ్‌ సాన్‌ సూకీపై పోలీసులు కొత్త ఆరోపణలు ప్రారంభించారు. విదేశాల నుంచి అక్రమంగా దిగుమతి చేసుకున్న వాకీటాకీలు ఆమె ఇంట్లో లభ్యమయ్యాయని, ఈ కేసులో ఆమెను ఫిబ్రవరి 15దాకా నిర్బంధంలో ఉంచుతామన్నారు. ప్రభుత్వం వద్ద రిజిస్టర్‌ కాని వాకీటాకీలను సూకీ భద్రతా సిబ్బంది వాడారని పేర్కొన్నారు. మయన్మార్‌లో సోమవారం కొత్త ప్రభుత్వాన్ని కూలదోసి, సైన్యం అధికారం చేపట్టిన సంగతి తెలిసిందే. అదే రోజు ఆంగ్‌ సాన్‌ సూకీని, ఆమె పార్టీకి చెందిన ముఖ్య నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్రమంగా వాకీటాకీల దిగుమతి కేసులో సూకీకి గరిష్టంగా రెండేళ్ల దాకా జైలుశిక్ష పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. 

మరిన్ని వార్తలు