ప్రశంసించడానికే వెళ్లాం! చైనాను బుజ్జగిస్తున్న అమెరికా!

11 Aug, 2022 21:35 IST|Sakshi

వాషింగ్టన్‌: అమెరికా సభ ప్రతినిధుల స్పీకర్‌ నాన్సీ పెలోసీ తైవాన్‌ పర్యటన తీవ్ర ఉద్రిక్తలకు దారితీసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు చైనా తైవాన్‌ చుట్టూతా పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ గస్తీ కాయడమే కాకుండా సైనిక కసరత్తులు ప్రారంభించింది కూడా. అంతేగాక తైవాన్‌ని భయభ్రాంతులకు గురిచేసేలా సైనిక విన్యాసాలను కొనసాగించింది.

పెలోసీ పర్యటన పూర్తయినప్పటికీ తన విన్యాసాలను కొనసాగించడమే కాకుండా తైవాన్‌ చుట్టూత తమ ఆర్మీ కార్యకలాపాలు పూర్తి అయ్యాయని, యుద్ధం చేయడమే తరువాయి అన్నట్లు ప్రకటించింది. పైగా ఏ క్షణమైన యుద్ధం చేసేందుకు రెడీ అంటూ.. తైవాన్‌ సరిహద్దులో తన ఆర్మీ డ్రిల్‌ కొనసాగుతుందని కరాఖండిగా చెప్పేసింది. దీంతో నాన్సీ పెలోసి ఈ విషయమై స్పందించి...కేవలం తైవాన్‌ని ప్రశంసించడానికే వెళ్లాం.

చైనా గురించి ప్రస్తావించడానికి వెళ్లలేదు. చైనా తైవాన్‌ని ఒంటరి చేయదు అంటూ తమ స్నేహ హస్తాన్ని అందించడానికి వెళ్లాం. అలాగే ఇండో పసిఫిక్‌ ప్రాంత అభివృద్ధిపై దృష్టి సారించేలా, చైనాకు ఆయా ప్రాంతాల్లో ఉ‍న్న వివాదాలను పరిష్కరించేలా సాగిన పర్యటనే తప్ప మరోకటి కాదని చెప్పారు.

పెలోసి ప్రతినిధి బృందం తైవాన్‌తో పాటు, సింగపూర్, మలేషియా, దక్షిణ కొరియా, జపాన్‌లను కూడా సందర్శించిందన్న విషయాన్ని చైనాకు గుర్తు చేశారు. చైనా అధ్యక్షుడు ఏం చెప్పినప్పటికీ అమెరికా తన నిబద్ధతకు కట్టుబడి తన మిత్ర దేశాలకు అండగా ఉంటుందని చెప్పారు. అంతేకాదు తైవాన్‌ని ఒత్తిడికి గురిచేసేలా సైనిక శిక్షణ కొనసాగించడానికి అమెరికా అనుమతించదని ఫెలోసీ నొక్కి చెప్పారు.

(చదవండి: 'తగ్గేదే లే' అని తెగేసి చెబుతున్న చైనా! ఎనీ టైం రెడీ!)

మరిన్ని వార్తలు