మార్స్‌పై రోవర్‌ అడుగులు షురూ!

7 Mar, 2021 06:11 IST|Sakshi

లాస్‌ఏంజెల్స్‌: మార్స్‌పై పరిశోధనల నిమిత్తం నాసా పంపిన పర్సెవరెన్స్‌ రోవర్‌ తాజాగా అంగారక ఉపరితలంపై టెస్ట్‌డ్రైవ్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. కుజుడిపై పరిశోధనలు ప్రారంభించే ముందు ఈ రోవర్‌ 6.5 మీటర్ల మేర ప్రయాణం చేసింది. ఇందుకు సుమారు 33 నిమిషాలు పట్టిందని నాసా వెల్లడించింది. రోవర్‌ పనితీరులో ఇది పెద్ద ముందడుగుగా అభివర్ణించింది. రోవర్‌లోని ప్రతి వ్యవస్థ పనితీరును చెక్‌ చేయడానికి ఈ టెస్ట్‌ డ్రైవ్‌ నిర్వహించినట్లు తెలిపింది.

ఇతర గ్రహాలపై రోవర్ల టెస్ట్‌డ్రైవ్‌కు ఎంతో ప్రాముఖ్యత ఉంటుందని, పర్సెవరెన్స్‌ ఈ పనిని అద్భుతంగా నిర్వహించిందని, దీనివల్ల రాబోయే రెండేళ్ల పాటు రోవర్‌ పనితీరు బాగుంటుందని నమ్ముతున్నట్లు నాసా సైంటిస్టు అనైస్‌ జరిఫియన్‌ చెప్పారు. ఇకపై పరిశోధనల్లో భాగంగా రోవర్‌ 200 మీటర్ల దూరాలను కూడా కవర్‌ చేయాల్సిఉంటుందన్నారు. గతనెల 18న ఈరోవర్‌ మార్స్‌పై లాండ్‌ అయింది. కుజుడిపై రాళ్లు, మట్టిని పరిశోధించడం, సూక్ష్మజీవుల ఉనికిని అన్వేషించడం,  మనిషి లాండ్‌ అయ్యే అవకాశాలను పరిశీలించడం దీని విధులు.

మరిన్ని వార్తలు