NASA: బాంబు పేల్చిన నాసా.. ఆ విలయం వందల హిరోషిమా అణు బాంబులకు సమానం!

24 Jan, 2022 17:28 IST|Sakshi

హుంగా టోంగా-హుంగా హాపై.. పదిరోజుల క్రితం దాకా పసిఫిక్‌ మహాసముద్రంలోని జనావాసరహిత దీవిగా ఉండేది. మరి ఇప్పుడో?.. ఏకంగా మ్యాప్‌ నుంచే కనుమరుగు అయిపోయింది. కారణం.. ఆ దీవిలోని అగ్నిపర్వతం భారీ శబ్ధాలతో బద్ధలైపోవడమే!. 


జనవరి 15వ తేదీన చిన్న దీవి దేశం టోంగాకు దగ్గర్లో ఉన్న ‘హుంగా టోంగా-హుంగా హాపై’ అగ్నిపర్వత దీవి..  మహాసముద్రం అడుగులోని అగ్నిపర్వతం బద్ధలుకావడంతో పూర్తిగా నాశనమైంది. ఆ ప్రభావం ఎంతగా ఉందంటే.. సముద్రం ముందుకు వచ్చి పెద్ద పెద్ద అలలతో సునామీ విరుచుకుపడింది. టోంగా రాజధాని నుకువాలోఫాపై దట్టమైన మందంతో విషపూరితమైన బూడిద అలుముకుంది. తాగే నీరు కలుషితం అయ్యింది. పంటలు దెబ్బతిన్నాయి. రెండు గ్రామాలు ఏకంగా జాడ లేకుండా సముద్ర గర్భంలో కలిసిపోయాయి!. ఈ ప్రకృతి విలయంపై నాసా సైంటిస్టులు ఇప్పుడు సంచలన ప్రకటన చేశారు. 

టోంగా అగ్నిపర్వతం బద్ధలైన ఘటన.. వంద హిరోషిమా అణు బాంబు ఘటనలకు సమానమని నాసా పేర్కొంది. ఐదు నుంచి ముప్ఫై మెగాటన్నుల టీఎన్‌టీ(ఐదు నుంచి 30 మిలియన్‌ టన్నుల) పేలితే ఎలా ఉంటుందో.. అంత శక్తితో ఆ అగ్నిపర్వతం పేలింది.   అందుకే అగ్ని పర్వత శకలాలు 40 కిలోమీటర్ల ఎత్తులో ఎగసిపడ్డాయి అని నాసా సైంటిస్టుల జిమ్‌ గార్విన్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. 

ఇదిలా ఉంటే 1945, ఆగష్టులో హిరోషిమా(జపాన్‌) పడిన ఆటం బాంబు 15 కిలోటన్నుల(15 వేల టన్నుల) టీఎన్‌టీ డ్యామేజ్‌ చేసింది. కేవలం ఒక్క నగరాన్ని మాత్రమే నామరూపాలు లేకుండా చేసింది. ఇప్పుడు అగ్నిపర్వతం ధాటికి సముద్రం కదిలి.. ఎక్కడో వేల కిలోమీరట్ల దూరంలోని తీరాల దగ్గర ప్రభావం చూపెట్టింది. ఇక టోంగాలో సునామీ ధాటికి ప్రాణ నష్టం పెద్దగా సంభవించకపోయినా!(స్పష్టత రావాల్సి ఉంది).. ఆస్తి నష్టం మాత్రం భారీగానే జరిగినట్లు తెలుస్తోంది. జపాన్‌, న్యూజిలాండ్‌తోపాటు పసిఫిక్‌ తీరంలోని చాలా దేశాలు సునామీ అలర్ట్‌ జారీ చేసి.. 48 గంటల పరిశీలన తర్వాత విరమించుకున్నాయి. 

సంబంధిత వార్త: సునామీకి ఎదురీగిన తాత.. అందుకే ప్రపంచం జేజేలు

మరిన్ని వార్తలు