కుప్పకూలిన ప్రభుత్వం: విశ్వాసం కోల్పోయిన ఓలి

10 May, 2021 19:01 IST|Sakshi

ఖాట్మాండు: నేపాల్‌ ప్రధానమంత్రి కేటీ శర్మ ఓలి పార్లమెంట్‌ విశ్వాసాన్ని కోల్పోయారు. ప్రచండ నేతృత్వంలోని నేపాల్‌ కమ్యూనిస్టు పార్టీ కేపీ శ‌ర్మ ఓలి ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. దీంతో ఆ ప్రభుత్వం మైనారిటీలో పడింది. ఈ నేపథ్యంలో ప్రధాని ఓలి సోమవారం పార్ల‌మెంట్‌లో విశ్వాస పరీక్ష కోల్పోయింది. అనుకూలంగా 96 ఓట్లు పడగా.. వ్యతిరేకంగా 124 ఓట్లు వచ్చాయి. 15 మంది ఎంపీలు ఎటువైపు లేరు. ప్రభుత్వానికి కావాల్సిన 136 మంది ఎంపీల మద్దతు లేకపోవడంతో ఓలీ ప్రభుత్వం పడిపోయింది. 

నేపాల్‌ పార్లమెంట్‌లో ప్రస్తుతం 271 మంది ఎంపీలు ఉన్నారు. ఓలి ప్రభుత్వం విశ్వాస పరీక్ష‌ నుంచి గట్టెక్కాలంటే కనీసం136 మంది ఎంపీల మద్దతు అవసర కాగా సీపీఎన్‌-యూఎంఎల్‌కు 121 మంది సభ్యులు ఉన్నారు. అయితే పుష్పకమల్‌ దహల్‌ (ప్రచండ) నేతృత్వంలోని కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ నేపాల్‌ మద్దతు ఉపసంహరించుకుంది. ఓలి తన ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి మరో 15 మంది మద్దతు అవసరం ఉండగా మద్దతు కూడగట్టుకోవడంలో ఓలి విఫలమయ్యారు. దీంతో పార్లమెంట్‌ విశ్వాసాన్ని కోల్పోయారు. 

సోమవారం సాయంత్రం జరిగిన చర్చలో  ఓలి తాను ప్రధానిగా చేసిన పనులు, సాధించిన విజయాలు.. లక్ష్యాలు తదితర అంశాలు పార్లమెంట్‌లో వివరించారు. అనంతరం ప్రతిపక్ష పార్టీ నేపాలి కాంగ్రెస్‌ అధ్యక్షుడు షేర్‌ బహదూర్‌ దేవుబా, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ నేపాల్‌ చైర్‌పర్సన్‌ పుష్పకమల్‌ దహల్‌ విశ్వాస పరీక్షపై మాట్లాడారు. ఓలీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రసంగించారు. మిగతా జనతా సమాద్‌వాది పార్టీ నాయకులు మహతో ఠాకూర్‌, ఉపేంద్రయాదవ్‌ విశ్వాస తీర్మానంపై మాట్లాడారు. విశ్వాసం కోల్పోవడంతో నేపాల్‌లో ప్రభుత్వం కుప్పకూలిపోయింది.

చదవండి: ‘మావల్ల కాదు.. మేం పంపలేం’ ప్రధానికి సీఎం లేఖ
చదవండి: రాజకీయాల్లో చిచ్చురేపిన అల్లుడి పెళ్లి బరాత్‌ 

మరిన్ని వార్తలు