షాక్‌: పొరుగు దేశంలో 26 మంది ఎంపీలకు కరోనా

10 May, 2021 16:51 IST|Sakshi

ఖాట్మండు: ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న అతి పెద్ద సమస్య కరోనా మహమ్మారి. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా, నిబంధనలు ఎన్ని పాటిస్తున్నా ఈ మాయదారి మహమ్మారి వదలడం లేదు . సాధారణ ప్రజలు నుంచి ప్రముఖులు, రాజకీయ నాయకులని తేడా లేకుండా అందరికీ సోకుతోంది. గత వారం నేపాల్‌లో ఎంపీలు క‌రోనా  పరీక్షలు చేయగా అందులో ఏకంగా 26మందికి పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. దాంతో ఇవాళ పార్ల‌మెంట్‌లో జరగబోయే ప్ర‌ధాని కేపీ శ‌ర్మ ఓలీ విశ్వాస‌ప‌రీక్ష‌పై అందరికీ ఉత్కంఠ నెలకొంది. 

 పార్లమెంట్ సెక్రటేరియట్ ప్రతినిధి రోజ్నాథ్ పాండే తెలిపిన వివరాల ప్రకారం.. 200 మందికి పైగా పార్లమెంటు సభ్యులు కరోనా పరీక్షలు చేయించుకున్నారు. అందులో 18 మంది పాజిటిగా నిర్ధారణ అయ్యింది. ఇక దిగువ సభలో కరోనా సోకిన సభ్యులతో కలపి ఈ సంఖ్య 26కు చేరుకుంది. ఇక సోమవారం జరగనున్న ఓలీ ప్రభుత్వ విశ్వాస పరీక్ష ఓటింగ్‌కు సంబంధించి ఈ 26 మంది ఓటింగ్‌ వేయడానికి ఉన్న దారులన్నీ పరిశీలిస్తున్నాము. దీనిపై ఇప్పటికే హౌస్ స్పీకర్, వైద్య అధికారులు సాధ్యమైన మార్గంలో పనిచేస్తున్నారని ఆయన అన్నారు.
ఓలి విశ్వాస‌పరీక్ష  ఫలితం ?
ప్రచండ నేతృత్వంలోని నేపాల్‌ కమ్యూనిస్టు పార్టీ కేపీ శ‌ర్మ ఓలి ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించడంతో ఆ ప్రభుత్వం మైనారిటీలో పడింది. ఈ నేపథ్యంలో ప్రధాని ఓలి ఇవాళ పార్ల‌మెంట్‌లో విశ్వాసపరీక్ష ఎదుర్కోబోతున్నారు. నేపాల్‌ పార్లమెంట్‌లో ప్రస్తుతం 271 మంది ఎంపీలు ఉన్నారు. ఓలి ప్రభుత్వం విశ్వాస పరీక్ష‌ నుంచి గట్టెక్కాలంటే కనీసం136 మంది ఎంపీల మద్దతు అవసరం. సీపీఎన్‌-యుఎంఎల్‌కు ప్ర‌స్తుతం 121 మంది సభ్యులు ఉన్నారు. ఓలి తన ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి మరో 15 మంది మద్దతు అవసరం.

( చదవండి: 25 సార్లు ఎవరెస్ట్‌ను అధిరోహించిన నేపాలీ దేశస్థుడు..! )

మరిన్ని వార్తలు