ఎవరెస్ట్‌ పైకి 27 సార్లు..!

23 May, 2023 05:11 IST|Sakshi

కమి రిటా షెర్పా రికార్డు సమం చేసిన పసంగ్‌ దవా షెర్పా

కఠ్మాండు: ప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్ట్‌ శిఖరాన్ని పసంగ్‌ దవా షెర్పా(46) పర్వతారోహకుడు 27సార్లు అధిరోహించారు. 8,848.86 మీటర్ల ఎత్తైన ఈ హిమాలయ శిఖరాన్ని సోమవారం ఉదయం 8.25 గంటలకు ఆయన చేరుకున్నట్టు పర్వతారోహక యాత్ర నిర్వహిస్తున్న ‘ఇమాజిన్‌ నేపాల్‌ ట్రెక్స్‌’ తెలిపింది.

తద్వారా కమి రిటా షెర్పా రికార్డును ఆయన సమం చేశారు. ఎవరెస్ట్‌ రీజియన్‌లో జన్మించిన పసంగ్‌ తొలిసారి 1998లో ఎవరెస్ట్‌ను అధిరోహించారు. మరోవైపు 53 ఏళ్ల కమి రిటా షెర్పా ఈ సీజన్‌లోనే ఎవరెస్ట్‌ను 28వ సారి ఎక్కి పసంగ్‌ను అధిగమించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం.

మరిన్ని వార్తలు