Mount Everest: 53 ఏళ్ల వయసులో విజయవంతంగా 27వసారీ.. తన రికార్డు తానే

18 May, 2023 03:29 IST|Sakshi

27 సార్లు పర్వతారోహణ చేసిన నేపాల్‌ షెర్పా కమీ రిటా

కఠ్‌మాండూ: నేపాల్‌కు చెందిన ప్రఖ్యాత పర్వతారోహకుడు కమీ రీటా షెర్పా మరోమారు ఎవరెస్ట్‌ పర్వతాన్ని అధిరోహించి తన గత రికార్డును తానే చెరిపేసి కొత్త రికార్డ్‌ను లిఖించారు. 53 ఏళ్ల రీటా బుధవారం ఉదయం విజయవంతంగా 27వసారీ ఎవరెస్ట్‌ను ఎక్కారని నేపాల్‌ పర్యాటక శాఖ ప్రకటించింది. దీంతో నూతన ప్రపంచ రికార్డు ఆవిçష్కృతమైంది.

గత ఏడాది రీటా 26వసారి ఎవరెస్ట్‌ పర్వతారోహణ విజయవంతంగా పూర్తిచేసి ప్రపంచ రికార్డును సృష్టించారు. ఆ రికార్డును మూడు రోజుల క్రితం మరో షెర్పా అయిన 46 ఏళ్ల పసంగ్‌ దవా సమం చేశారు. దీంతో రీటా బుధవారం మరోమారు పర్వతమెక్కి తన పేరిట రికార్డును లిఖించుకున్నారు. ఈయన 1994 మే 13న తొలిసారి ఈ పర్వతశిఖరాన్ని చేరారు. రీటా గతంలోనే ప్రపంచంలోని 8,000 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తున్న పలు శిఖరాలను అధిరోహించారు.

సీనియర్‌ మౌంటేన్‌ గౌడ్‌గా పనిచేస్తున్నారు. బుధవారంనాటి పర్వతారోహణకు అయిన ఖర్చులను కఠ్‌మాండూకు చెందిన ఒక వాణిజ్య సాహసయాత్రల నిర్వహణ సంస్థ భరించింది. ఈ స్ప్రింగ్‌ సీజన్‌లో ఇప్పటిదాకా మొత్తంగా 478 మందికి ఎవరెస్ట్‌ ఎక్కేందుకు అనుమతులు వచ్చాయి. 

మరిన్ని వార్తలు