ఆండ్రాయిడ్‌ ఫోన్లలో కొత్త మాల్‌వేర్‌..!

28 Mar, 2021 14:54 IST|Sakshi

మీరు  వాడేది ఆండ్రాయిడ్‌ ఫోనా..! అయితే మీరు ఈ వార్తను కచ్చితంగా చదవాల్సిందే. గత కొన్నిరోజులుగా ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌పై కొత్త మాల్‌వేర్‌ దాడి చేయడానికి ప్రయత్నిస్తోందని సెక్యూరిటీ నిపుణులు కనుగొన్నారు. ఈ కొత్త మాల్‌వేర్‌ ఇతర మాల్‌వేర్‌కన్నా మరింత భయంకరంగా తన ప్రభావాన్ని చూపనుంది. సిస్టమ్‌ ఆప్‌డేట్‌ ముసుగులో గోప్యంగా ఆండ్రాయిడ్‌ ఫోన్లలలో  కనిపించకుండా ఉంటుంది.

ప్రముఖ మొబైల్‌ సెక్యూరిటీ కంపెనీ ‘జింపెరియం’ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఈ కొత్త మాల్‌వేర్‌ సిస్టమ్‌ ఆప్‌డేట్‌గా చూపిస్తుందని తెలిపారు. ఈ మాల్‌వేర్‌ను గుర్తించడం చాలా కష్టమని పేర్కొన్నారు. ఒకసారి ఈ మాల్‌వేర్‌ ఇన్‌స్టాల్‌ అయ్యాక మొత్తం మొబైల్‌ ఫోన్‌ను తన కంట్రోల్‌లోకి తీసుకొని, కేవలం డేటానే కాకుండా ఇతర సమాచారాన్ని , ఫోటోలను , మెసేజ్‌లను తస్కరిస్తుంది. ఒకసారి మొబైల్‌ ఫోన్‌లో ఇన్‌స్టాల్‌ అయ్యాక హ్యాకర్లుడేటాను తమ అదుపులోనికి తెచ్చుకుంటారు.

అంతేకాకుండా మొబైల్‌ ఫోన్‌ కాల్‌ డేటా, మెసేజ్‌లు , డిఫాల్ట్ గా ఉన్న బ్రౌజర్‌ సమాచారాన్ని , జీపీఎస్‌ లోకేషన్‌ను హ్యాకర్లు ట్రాక్‌చేయనున్నారు. జింపెరియం కంపెనీ సీఈవో శ్రీధర్‌ మాట్లాడుతూ.. ఈ మాల్‌వేర్‌ మిగతా వాటికంటే చాలా ప్రమాదకారమని తెలిపారు. ప్రస్తుతం ఈ మాల్‌వేర్‌ గూగుల్‌ ప్లే స్టోర్‌లో లేకపోవడం ఒకింతా ధైర్యానిచ్చినా, ఇతర థర్డ్ పార్టీ ఆండ్రాయిడ్‌ యాప్‌లను ఇన్‌స్టాల్‌ చేస్తే ఫోన్లలోకి వచ్చే ప్రమాదం ఉందని వివరించారు.

చదవండి: గూగుల్‌పే, జీమెయిల్‌ క్రాష్‌ అవుతోందా? ఇలా చేయండి!

మరిన్ని వార్తలు