జెసిండా మరో సంచలనం

2 Nov, 2020 13:55 IST|Sakshi

వైవిధ్యంగా జెసిండా కేబినెట్‌

భారత సంతతికి చెందిన  ప్రియాంకా రాధాకృష్ణన్

తొలి విదేశాంగ మంత్రి ‘గే’ నానియా మహూతా

న్యూజిలాండ్‌ ప్రధానమంత్రి జెసిండా ఆర్డెర్న్ మరో సంచలననిర్ణయం తీసుకున్నారు. ప్రపంచంలోని అత్యంత వైవిధ్యమైన పార్లమెంటులలో ఒకటిగా తీర్చి దిద్దుతున్నారు. మాజీ ఆర్థిక మంత్రి గ్రాంట్ రాబర్ట్‌సన్‌ను ఉప ప్రధానమంత్రిగా ప్రకటించారు. అంతేకాదు విదేశాంగ మంత్రిగా నానియా మహూతాను నియమించారు. 20మంది సభ్యుల మంత్రివర్గంలో ఐదుగురు కొత్త మంత్రులను తీసుకున్నారు.  క‌రోనా వైర‌స్‌తో ఏర్ప‌డిన లాక్‌డౌన్ వ‌ల్ల ప్ర‌పంచ‌దేశాల ఆర్థిక వ్య‌వ‌స్థ‌ల‌న్నీ అత‌లాకుత‌లం చేస్తున్న సమయంలో హెలికాప్ట‌ర్ మ‌నీ (ప్ర‌జ‌ల‌కు నేరుగా ఉచితంగా డ‌బ్బును పంపిణీ)  అంటూ తీవ్రచర్చకు  తెరతీసిన  గ్రాంట్ రాబ‌ర్ట్‌స‌న్  మరోసారి ఆర్థిక మంత్రిగా బాధ్యతలను  స్వీకరించనున్నారు

విదేశాంగ మంత్రిగా నానియా మహూతా
గడ్డం మీద సాంప్రదాయ మావోరి మోకో కాయే పచ్చబొట్టుతో  నాలుగేళ్ల క్రితం (1996లో) దేశంలోని మొట్టమొదటి మహిళా పార్లమెంటు సభ్యురాలిగా ఖ్యాతి గడించిన మహూతా తాజాగా మరో రికార్డును సొంతం చేసుకున్నారు.  విదేశాంగమంత్రి పదవి చేపట్టనున్న తొలి స్వలింగ సంపర్కురాలు మెహుతా. మునుపటి విదేశాంగ మంత్రి  విన్‌స్టన​ పీటర్స్ కూడా మావోరికి చెందిన వారే కావడం విశేషం.

భారత సంతతికి చెందిన ప్రియాంకా రాధాకృష్ణన్
మరోవైపు భారత సంతతికి చెందిన ప్రియాంకా రాధాకృష్ణన్ (41) జెసిండా మంత్రివర్గంలో చోటు సంపాదించారు. కమ్యూనిటీ, వాలంటరీ సెక్టార్‌ మంత్రిగా పదవీ బాధ్యతలను స్వీకరించ నున్నారు.  గృహ హింస బాధిత మహిళలు, వలస కార్మికుల  తరపున  పోరాడుతున్న ప్రియాంకా  2017లో తొలిసారి లేబర్ పార్టీ తరపున పార్లమెంటు సభ్యురాలిగా ఎన్నికయ్యారు.

ఇటీవల ఎన్నికల్లో రెండోసారి ఘనవిజయం సాధించి చరిత్ర సృష్టించిన జెసిండా తాజాగా తన క్యాబినెట్‌ను విభిన్నంగా తీర్చిద్దిదారు. ప్రతిభ, యోగ్యత కలిగినవారికే తన మంత్రివర్గంలో చోటిచ్చామని ఇందుకు చాలా గర్వంగా ఉందని ఆమె ప్రకటించారు. రాబోయే మూడేళ్ళు తాము సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉందని ప్రధాని జెసిండా వెల్లింగ్టన్లో విలేకరులతో అన్నారు. కరోనా మహమ్మారి సంక్షోభంతో ప్రపంచ ఆర్థికవ్యవస్థ మాంద్యంలోకి జారుకుందని, ఈ ప్రభావం తమపై కూడా ఉంటుందని పేర్కొన్నారు. అయితే ఆర్థిక పునరుద్ధరణను వేగవంతం చేయనున్నామనే విశ్వాసాన్ని ఆమె వెల్లడించారు.

మరిన్ని వార్తలు