నో ఎంట్రీ : జెసిండా ఆర్డెర్న్ కీలక నిర్ణయం

8 Apr, 2021 13:02 IST|Sakshi

కరోనా ఉధృతి : న్యూజిలాండ్‌  కీలక  నిర్ణయం

ఇండియా నుంచి వచ్చే ప్రయాణీకులపై నిషేధం

ఏప్రిల్ 11 సాయంత్రం నుంచి ఏప్రిల్ 28  వరకు అమలు

సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో  రెండో దశలో  కరోనా కేసులు  రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి.  తాజా గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా రోజువారీ కేసుల సంఖ్య లక్షను దాటేసిన నేపథ్యంలో న్యూజిలాండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ నుంచి ప్రయాణాలపై తాత్కాలికంగా నిషేధం విధిస్తూ న్యూజిలాండ్  ప్రధాని జెసిండా ఆర్డెర్న్ కీలక  ఆదేశాలు జారీ చేశారు. అలాగే తమ పౌరులను కూడా అనుమతించేది లేదంటూ మీడియా సమావేశంలో వెల్లడించారు.  (కరోనా ప్రమాద ఘంటికలు: సోనూసూద్‌ స్పెషల్‌ డ్రైవ్‌)

విదేశాల నుంచి న్యూజిలాండ్‌కు వచ్చిన ప్రయాణికుల్లో 23 మందికి కరోనా పాజిటివ్  నిర్ధారణ అయింది.. వీరిలో 17 మంది భారత్ నుంచి వచ్చిన వారే ఉన్నారు . దీంతో తాత్కాలికంగా రెండు వారాలపాటు ఇండియానుంచి ఎవరూ తమదేశానికి రాకుండా నిషేధం విధించారు. వైరస్‌ లోడ్‌ పెరుగుతున్న దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదని ఆమె పేర్కొ‍న్నారు. అంతేకాదు కేసుల తీవ్రతను బట్టి నిషేధాన్ని పొడిగించే అవకాశం కూడా లేకపోలేదన్నారు. ఏప్రిల్ 11 సాయంత్రం 4 గంటల నుంచి ఏప్రిల్ 28 వరకు అమల్లో ఉండనుంది.  (కోవిషీల్డ్ టీకా: సీరమ్‌కు ఎదురు దెబ్బ!)

కాగా ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాప్తి నిలువరించ గలిగిన దేశాల్లో ఒకటిగా జెసిండా నేతృత్వంలోని న్యూజిలాండ్ నిలిచింది. గత 40 రోజులుగా కేసులు నమోదు కాకపోవడం గమనార‍్హం. మరోవైపు ఇండియాలో కరోనా  మహమ్మారి  శరవేగంగా విస్తరిస్తోంది. గురువారం నాటికి లక్షా 26 వేల కేసులతో హైయ్యస్ట్‌ రికార్డును తాకిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు