బ్రిటన్ కోర్టులో నీరవ్ మోదీకి షాక్.. ఇక అన్ని దారులు మూసుకుపోయినట్లే!

15 Dec, 2022 17:28 IST|Sakshi

లండన్‌: రూ.11వేల కోట్ల బ్యాంకు మోసానికి పాల్పడి విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరగాడు నీరవ్ మోదీకి బ్రిటన్ కోర్టులో షాక్ తగిలింది. తనను భారత్‌కు అప్పగించే విషయంపై అక్కడి సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు లండన్ హైకోర్టు నిరాకరించింది. దీంతో ఆయనకు చట్టపరంగా ఉన్న అన్ని దారులు మూసుకుపోయినట్లు అయింది. ఫలితంగా ఆయనను త్వరలోనే భారత్‌కు తీసుకువచ్చే సూచనలు కన్పిస్తున్నాయి.

గుజరాత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ.. పంజాబ్‌ నేషనల్ బ్యాంకును రూ.11 వేల కోట్ల మేర మోసం చేశాడు. ఈ విషయం బయటకు రావడంతో 2018లో దేశం వీడి పారిపోయాడు. 2019లో లండన్‌లో అరెస్టయ్యాడు. అప్పటి నుంచి అక్కడి జైలులోనే ఉంటున్నాడు. తనను భారత్‌కు అప్పగించొద్దని గతనెలలోనూ కోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం ఆయన అప్పీల్‌ను రిజెక్ట్ చేసింది.

దీంతో చివరి ప్రయత్నంగా సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు అనుమతి కోరుతూ లండన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. తాను భారత్‌కు వెళ్తే ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు వస్తాయని, మానసికంగా సమస్యలున్నాయని పిటిషన్‌లో పేర్కొన్నాడు. న్యాయస్థానం వీటిని తోసిపుచ్చి అప్పీల్‌ను రిజెక్ట్ చేసంది.

అయితే నీరవ్‌కు ఇంకా ఓ అవకాశం ఉంది. తనను భారత్‌కు అప్పగించే విషయంపై ఐరోపా సమాఖ్య మానవ హక్కుల కోర్టును ఆయన ఆశ్రయించవచ్చు.
చదవండి: రష్యాను వణికిస్తున్న ‘ఫ్లూ’ భయం.. ఇప్పటికే అనారోగ్యంతో పుతిన్‌! బంకర్‌లోనే

మరిన్ని వార్తలు