పోస్టల్‌ ఓట్లకు భారీ డిమాండ్‌

5 Sep, 2020 08:16 IST|Sakshi

రలీగ్‌ (అమెరికా): మహమ్మారి కరోనా వ్యాప్తి నేపథ్యంలో అమెరికాలో పోస్టల్‌ ఓట్లకు డిమాండ్‌ భారీగా పెరిగింది. అధ్యక్ష ఎన్నికల వేళ పోలింగ్‌ బూత్‌కు వెళ్లి ఓటు వేసే రిస్క్‌ను తీసుకోవడానికి చాలామంది సిద్ధంగా లేరు. ఈ నేపథ్యంలో నార్త్‌ కరోలినాలో శుక్రవారం పోస్టల్‌ బ్యాలెట్‌లను పంపడం మొదలైంది. తొలిదశలో 6.18 లక్షల పోస్టల్‌ బ్యాలెట్‌లకు అభ్యర్థనలు అందాయి. నాలుగేళ్ల కిందటితో పోలిస్తే ఇది 16 రెట్లు ఎక్కువ. విస్కాన్సిన్‌లో కిందటిసారితో పోలిస్తే లక్ష అభ్యర్థనలు ఎక్కువ వచ్చాయి. ఫోర్లిడాలో 2016లో 33.47 లక్షల మంది పోస్టల్‌ బ్యాలెట్‌ను ఉపయోగించుకోగా... ఈసారి ఇప్పటికే 42.70 లక్షల అభ్యర్థనలు అందాయి. (చదవండి: అమెరికాలో నవంబర్‌ కల్లా కోవిడ్‌ టీకా)

ఇక అత్యధికంగా డెమొక్రాటిక్‌ పార్టీ మద్దతుదారుల నుంచే పోస్టల్‌ బ్యాలెట్‌ అభ్యర్థనలు అందుతుండటం విశేషం. వీరి తర్వాత తటస్థులు దీనిని ఎక్కువగా వినియోగించుకుంటున్నారు. కాగా పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా అవకతవకలు జరిగే అవకాశం ఉందని రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి, అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇప్పటికే అనేకసార్లు అనుమానం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. పోస్టల్‌ శాఖకు అదనపు నిధుల మంజూరును ట్రంప్‌ అడ్డుకోవడంతో... భారీగా వచ్చే పోస్టల్‌ బ్యాలెట్లను కౌంటింగ్‌ కేంద్రాలకు చేర్చేందుకు వనరులు ఉండవనే ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో సకాలంలో ఓట్లు లెక్కింపు, ఫలితాల వెల్లడిపై కూడా సందేహాలు వ్యక్తమవుతున్నాయి.(చదవండి: వర్షంలో తడిస్తే నా జుట్టు పాడవుతుంది: ట్రంప్‌)

చదవండి: అమెరికా ఎన్నికలు; పోస్టల్‌ పోరు

మరిన్ని వార్తలు