ఉత్తర కొరియా అరాచకాలు..వెలుగులోకి విస్తుపోయే దారుణాలు!

31 Mar, 2023 11:15 IST|Sakshi

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ తన నియంతృత్వ పాలనతో వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. అదీగాక కిమ్‌ తన దేశ ప్రజలు, పౌరుల పట్ల కఠినంగా వ్యహరిస్తాడంటూ.. పలు వార్తలు గుప్పుమన్నాయి కూడా.  వాటిలో నిజానిజాలు ఎంత అనేది అందరి మదిలో తలెత్తిన ప్రశ్న. అయితే ఇప్పుడూ అవన్నీ నిజమేనంటూ బల్లగుద్ది మరీ చెబుతోంది దక్షిణ కొరియా మంత్రిత్వ శాఖ. అందుకు సంబంధించిన వాటిని సమగ్రంగా దర్యాప్తు చేసి మరీ ఆధారాలతో సహా ఒక నివేదికను కూడా ఇచ్చింది.

అందులో ఉత్తర కొరియా ఎంత ఘోరంగా మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడిందో వివరించింది. అందుకోసం దక్షిణ కొరియా 2017 నుంచి 2022 మధ్యలో తమ మాతృభూమిని వదిలో వచ్చేసిన దాదాపు 500 మందికి పైగా ఉత్తర కొరియన్ల నుంచి వివరాలను సేకరించినట్లు కూడా తెలిపింది. దక్షిణ కొరియా మంత్రిత్వశాఖ ఇచ్చిన నివేదికలో.. అక్కడ పౌరుల జీవించే హక్కే ప్రమాదంలో ఉన్నట్లు తెలిపింది. పిల్లల దగ్గర నుంచి వికలాంగులు, గర్భిణీల వరకు ఎవరినీ వదిలిపెట్టకుండా ఉరిశిక్షలు అమలు చేసినట్లు తెలిపింది. ప్రజలను బెదిరింపులకు గురి చేసి బలవంతంగా మానవ ప్రయోగాల్లోకి దించినట్లు పేర్కొంది.

నర్సు చేత బలవంతంగా మరుగుజ్జుల జాబితాను తయారు చేయించి .. వారిపై మానవ ప్రయోగాలు నిర్వహించిందని తెలిపింది. ఒక ఆరు నెలల గర్భిణి స్త్రీ తన ఇంటిలో దివగంత కిమ్‌ ఇల్‌ సంగ్‌ చిత్రపటం ఎదుట డ్యాన్స్‌లు చేసిందన్న కారణంతో ఉరితీశారు. అలాగే దక్షిణ కొరియా మీడియాకు సంబంధించి ఏదైనా ఆన్‌లైన్‌లో షేర్‌చేసినా, అక్కడ నుంచి డ్రగ్స్‌ తీసుకొచ్చినా.. వారందర్నీ ఉరితీసినట్లు వెల్లడించింది. అలాగే దక్షిణ కొరియాకు సంబంధించిన వీడియో ఫుటేజ్‌ని చూస్తూ.. నల్లమందు సేవించిన ఆరుగురు యువకులను నిర్ధాక్షిణ్యంగా కాల్చి చెప్పినట్లు పేర్కొంది.

మనుషులను మానవ ప్రయోగాల కోసం నిద్రమాత్రలు ఇచ్చి మరీ ఆస్పత్రికి తరలించినట్లు నివేదికలో స్పష్టం చేసింది. ముఖ్యంగా వికలాంగులు, మరగుజ్జుగా ఉన్నవారిపై ఇష్టారాజ్యంగా మానవ ప్రయోగాలు నిర్వహించారంటూ..అ‍క్కడ జరిగిన భయంకరమైన మానవ హక్కుల ఉల్లంఘనలకు సంబంధించి సుమారు 450 పేజీల నివేదికను దక్షిణ కొరియా మంత్రిత్వ శాఖ సమర్పించింది. 

(చదవండి: మిస్టరీగా కొత్త వైరస్‌ వ్యాప్తి.. 24 గంటల్లో ముగ్గురు మృతి!)
 

మరిన్ని వార్తలు