అమెరికాతో చర్చలపై ఆసక్తి లేదు: ఉత్తర కొరియా

24 Jun, 2021 03:56 IST|Sakshi

ఉత్తర కొరియా విదేశాంగ మంత్రి రి సన్‌ గ్వాన్‌ 

సియోల్‌: అమెరికాతో అణు చర్చలను పునఃప్రారంభించే ఉద్దేశం తమకు ఎంతమాత్రం లేదని ఉత్తర కొరియా విదేశాంగ మంత్రి రి సన్‌ గ్వాన్‌ బుధవారం తేల్చిచెప్పారు. అమెరికాతో చర్చలపై తమకు ఆసక్తి లేదని పేర్కొన్నారు. సంప్రదింపులు మళ్లీ మొదలయ్యే అవకాశం ఉందంటూ అమెరికా, దక్షిణ కొరియా అధికారులు ఇటీవలి కాలంలో ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వారి ఆశలపై రి సన్‌ గ్వాన్‌ నీళ్లు చల్లారు.

ఇప్పటికిప్పుడు అమెరికాతో సంబంధాలు పెంపొందించుకోవాలన్న ఆలోచన తమకు లేదని పేర్కొన్నారు. తమతో మళ్లీ చర్చలు మొదలుపెట్టాలని అమెరికా గనుక భావిస్తే తీవ్ర ఆశాభంగం తప్పదని ఉత్తర కొరియా నియంత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ సోదరి కిమ్‌ యో జోంగ్‌ మంగళవారం స్పష్టం చేశారు. 2019లో అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్, కిమ్‌ జోంగ్‌ ఉన్‌ మధ్య జరిగిన అణు చర్చలు అర్ధాంతరంగా నిలిచిపోయిన సంగతి తెలిసిందే.  

మరిన్ని వార్తలు