Zombie Unit In North Korea: కిమ్ సైన్యంలో 'జాంబీలు'.. ఫొటో వైరల్..!

11 Feb, 2023 15:07 IST|Sakshi

సియోల్‌: ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్.. ఇటీవల సైనిక పరేడ్‌ను అట్టహాసంగా నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరేడ్‌లో శక్తిమంతమైన ఆయుధాలతోపాటు అత్యాధునిక, భారీ అణు క్షిపణులను ప్రదర్శించి శత్రు దేశాలకు తన సత్తా ఏంటో తెలిసేలా చేశారు. అయితే సైనిక పరేడ్‌లో పాల్గొన్న ఓ యూనిట్ అందరి దృష్టిని ఆకర్షించింది.  అదే జాంబీ యూనిట్.

కిమ్ సైనిక పరేడ్‌లో జాంబో యూనిట్‌ను చూసి అక్కడున్న వారు ఆశ్చర్యపోయారు. జాంబీల్లా కన్పిస్తున్న ఈ సైనికుల పరేడ్ చూపరులను విశేషంగా ఆకట్టుకుంది. మొహానికి రంగులు వేసుకుని ఒళ్లంతా పచ్చగడ్డి కప్పుకున్నట్లుగా కన్పించిన సైనిక వేషధారణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇందుకు సంబంధించిన ఫొటోను ఓ వ్యక్తి సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయగా అది వైరల్‌గా మారింది. ఈ పరేడ్‌లో క్షిపణులు, అత్యాధునిక ఆయుధాలు, రాకెట్ల కంటే జాంబీ యూనిట్‌ను చూసినప్పుడే తాను భయపడ్డాని అతను చెప్పుకొచ్చాడు.
కాగా.. కొరియన్ పీపుల్ రివల్యూషన్ ఆర్మీ వార్షికోత్సవం  సందర్భంగా కిమ్ బుధవారం ఘనంగా సైనిక పరేడ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో  ఆయన పదేళ్ల కూతురు కిమ్ జూ అయే కూడా పాల్గొన్నారు. దీంతో కిమ్ తర్వాతే ఈమే ఉత్తర కొరియాను పాలించేందుకు సన్నద్ధమవుతోందనే ప్రచారం ఊపందుకుంది. కిమ్‌ జూ అయే బహిరంగంగా ప్రజలకు కనిపించడం ఇది ఐదోసారి కావడం గమనార్హం.
చదవండి: యద్ధాన్ని ఆపేలా పుతిన్‌ని మోదీ ఒప్పించగలారా?

మరిన్ని వార్తలు