మిలిటరీ వైఫల్యం: అత్యంత ప్రమాదకర సరిహద్దులోకి వ్యక్తి..

24 Feb, 2021 13:45 IST|Sakshi

సియోల్‌ : దక్షిణ కొరియా సైనికుల కళ్లు గప్పి ఓ వ్యక్తి ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన సరిహద్దు.. డీమిలిటరైజ్డ్‌ జోన్‌(డీఎమ్‌జెడ్‌)లో అడుగుపెట్టాడు. ఉత్తర, దక్షిణ కొరియా దేశాల సరిహద్దులోని డీఎమ్‌జెడ్‌లోకి ప్రవేశించి తచ్చాడుతున్న అతడ్ని కొన్ని గంటల తర్వాత అదుపులోకి తీసుకున్నాయి దక్షిణ కొరియా బలగాలు. అతడ్ని ఉత్తర కొరియాకు చెందిన వ్యక్తిగా అధికారులు గుర్తించారు. మంగళవారం తెల్లవారుజామున 4.16 నిమిషాలకు డీఎమ్‌జెడ్‌లోకి వెళ్లిన అతడ్ని.. 7.27 నిమిషాలకు అదుపులోకి తీసుకున్నారు. దాదాపు 3 గంటల పాటు సరిహద్దులో గడిపాడు. కట్టు దిట్టమైన భద్రత ఉన్నప్పటికి ఆ వ్యక్తి లోపలికి ఎలా ప్రవేశించాడు.. అన్ని గంటల పాటు లోపల తిరుగుతున్న అతడ్ని బలగాలు ఎందుకు గుర్తించలేకపోయాయి అన్న విషయాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. 

సముద్ర మార్గం ద్వారా అతడు డీఎమ్‌జేలోకి ప్రవేశించి ఉంటాడని తెలుస్తోంది. రాత్రి ఒంటి గంట ప్రాంతంలో సరిహద్దులోని కంచె వెంట నడుస్తూ.. డ్రైనేజ్‌ టెన్నెల్‌ ద్వారా డీఎమ్‌జెడ్‌లోని ప్రవేశించి ఉంటాడని, ఆ దారి గురించి మిలిటరీకి కూడా సరిగా తెలియదని యోన్‌హప్‌ న్యూస్‌ అభిప్రాయపడింది. ఈ సంఘటనపై అధికారులు డీఎమ్‌జెడ్‌ సెక్యూరిటీ విభాగంపై దర్యాప్తుకు ఆదేశించారు.

చదవండి : కోపంతో నా ఫ్రెండ్‌ ముక్కు పగులగొట్టా: ఒబామా

మరిన్ని వార్తలు