అదే జరిగితే.. 500 కోట్లమంది పరోక్షంగా చనిపోతారు! ఎలాగంటే..

16 Aug, 2022 12:32 IST|Sakshi

న్యూజెర్సీ: ప్రకృతికి బదులు.. సృష్టి వినాశనానికి ఇప్పుడు మనిషే కారణం అయ్యేలా కనిపిస్తున్నాడు. అందునా అణు యుద్ధం ప్రత్యక్షంగా కంటే.. పరోక్షంగానే వందల కోట్ల మందిని బలి తీసుకుటుందనే ఊహా.. భయాందోళనలను రేకెత్తిస్తోంది ఇప్పుడు.

న్యూజెర్సీ రూట్గెర్స్‌ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు.. అణు యుద్ధాలతో తలెత్తబోయే సంక్షోభాల మీద ఒక సుదీర్ఘ అధ్యయనం నిర్వహించారు. దీని ప్రకారం.. ఆధునిక అణుయుద్ధం వల్ల తాండవించే కరువు, ఆహారపంటల లేమి ద్వారానే ఎక్కువ మంది బలైపోతారని.. ఆ సంఖ్య సుమారు ఐదు బిలియన్లు(ఐదు వందల కోట్ల మందికిపైనే) ఉంటుందని పేర్కొన్నారు.

అణ్వాయుధాల పేలుడుతో వాతావరణంలో సూర్యకాంతి నిరోధించే మసి ద్వారా ఆహార కొరత ఏర్పడుతుందని.. ప్రాణాంతకమైన పేలుళ్ల వల్ల కలిగే ప్రాణనష్టం కంటే ఇది చాలా ఎక్కువని ఆ బృందం అభిప్రాయపడింది. ఒకవేళ అమెరికా-రష్యా మధ్య గనుక అణు యుద్ధం జరిగితే.. సగం మానవ జనాభా అంతరించిపోయే ప్రమాదం ఉంది. ఈ మేరకు యుద్ధ ప్రభావంతో ఏయే దేశంలో ఎంతమేర ఆహార పంటలపై ప్రభావం చూపుతుందనే విషయాన్ని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ అట్మాస్పిరిక్‌ రీసెర్చ్‌ ద్వారా సేకరించింది శాస్త్రవేత్తల బృందం. 

అంతెందుకు భారత్‌-పాక్‌ మధ్య గనుక చిన్నపాటి యుద్ధం జరిగినా..  ఆ పరిణామం ప్రపంచ ఆహారోత్పత్తి మీద పెను ప్రభావం చూపుతుందని ఆ బృందం వెల్లడించింది. ఐదేళ్లలో ఇరు దేశాల్లో ఏడు శాతం పంట దిగుబడి తగ్గిపోతుందని.. అదే అమెరికా-రష్యాల మధ్య జరిగే యుద్ధం జరిగితేగనుక.. మూడు నుంచి నాలుగేళ్లలో 90 శాతం ఉత్పత్తి పడిపోతుందని తెలిపింది. 

ఈ ముప్పు నుంచి తప్పించుకునేందుకు తీసుకునే చర్యలు చేపట్టినా.. రాబోయే పెనుఉపద్రవం ముందు ఆ చర్యలు పెద్దగా ప్రభావం చూపెట్టకపోవచ్చనే అభిప్రాయపడింది న్యూజెర్సీ రూట్గెర్స్‌ యూనివర్సిటీ సైంటిస్టుల బృందం. ఉక్రెయిన్‌పై రష్యా దాడి నేపథ్యంలోనే.. ఈ బృందం ఈ తరహా అధ్యయనానికి చేపట్టింది. పైగా అణు యుద్ధం తలెత్తవచ్చంటూ గతంలో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్‌ చేసిన కామెంట్లను సైతం పరిశీలనలోకి తీసుకుంది. ఈ అధ్యయానికి సంబంధించిన విషయాలు నేచర్‌ ఫుడ్‌ జర్నల్‌లో తాజాగా ప్రచురితం అయ్యాయి.

ఇదీ చదవండి: భారత్‌ హెచ్చరికలు బేఖాతరు చేసిన చైనా

మరిన్ని వార్తలు