అమెరికాలో మరణ శిక్షల తీరు

11 Dec, 2020 20:09 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : అమెరికాలో ప్రస్తుతం దోషులకు విధిస్తున్న మరణ శిక్షలను విషపు ఇంజెక్షన్లు ఇవ్వడం ద్వారా అమలు చేస్తున్నారు. సకాలంలో కావాల్సిన విషపు మందులు అందుబాటులో లేకపోవడం వల్ల ఈ మరణ శిక్షల అమల్లో ఆలస్యం కూడా జరగుతోంది. ఈ క్రిస్మస్‌ నుంచి మరణ శిక్షల అమలుకు ఇతర పద్ధతులను కూడా అమల్లోకి తెస్తున్నారు. ఒకప్పుడు పలు దేశాలు అమలు చేసిన ఎలక్ట్రిక్‌ చేర్‌కు కట్టేసి, గ్యాస్‌ చాంబర్‌లో నిర్బంధించి, తుపాకులతో కాల్చి చంపే పద్ధతులను అమల్లోకి తెస్తున్నారు. నవంబర్‌ 27వ తేదీనే అమెరికా జస్టిస్‌ విభాగం ఈ ప్రత్యామ్నాయ పద్ధతులను తీసుకొచ్చింది. వీటిలో భారత్‌లో లాగా ఉరి శిక్ష అమలు చేయడం లేదు. 

అమెరికా నూతన అధ్యక్షుడిగా జో బైడెన్‌ జనవరి 20వ తేదీన ప్రమాణ స్వీకారం చేసే నాటికి మరణ శిక్షలు త్వరితగతిన అమలు చేయడంలో విషపు ఇంజెక్షన్ల కొరత ఏర్పడ కూడదన్న ఉద్దేశంతో అమెరికా న్యాయ విభాగం మరణ శిక్షల అమలుకు ఈ ప్రత్యామ్నాయ మరణ శిక్షలను సూచించి ఉండవచ్చు. 2020, జనవరి నాటికి అమెరికాలో మరణ శిక్షలు పడి నిర్బంధంలో ఉన్న దోషులు 2,600 మంది కాగా, గత జూలై 14వ తేదీ నుంచి దేశాధ్యక్ష ఎన్నికలు జరిగే నాటికి డోనాల్డ్‌ ట్రంప్‌ యంత్రాంగం 1550కి పైగా మరణ శిక్షలను అమలు చేసింది. ట్రంప్‌ ఎన్నికల్లో ఓడిపోయాక బ్రాండెన్‌ బెర్నార్డ్‌ అనే 40 ఏళ్ల యువకుడికి గురువారం రాత్రి విషపు ఇంజెక్షన్‌ ఇవ్వడం ద్వారా మరణ శిక్ష విధించారు. చిన్న దోపిడీకే ఆ యువకుడికి మరణ శిక్ష పడింది. కిమ్‌ కర్దాషియన్‌ సెలబ్రిటీలు నిందితుడికి క్షమాభిక్ష ప్రసాదించాల్సిందిగా విజ్ఞప్తులు చేసినా లాభం లేకపోయింది. 

అమెరికాలో మరణ శిక్షలు వివాదాస్పదం అవుతున్న నేపథ్యంలో వాటిని తాను అధికారంలోకి రాగానే రద్దు చేస్తానని నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌ ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చారు. ఈ కారణంగా ఆయన వచ్చేలోగా మరో ఐదుగురికి మరణ శిక్షలు అమలు చేసేందుకు ట్రంప్‌ యంత్రాంగం ఇది వరకే సిద్ధమైనట్లు తెలుస్తోంది. 

ఒకప్పుడు అమెరికాలోనూ ఉరి శిక్షలు
అమెరికాలో ఒకప్పుడు మరణ శిక్షలను ఉరి తీయడం ద్వారా అమలు చేసేవారు. అందులో అమానుషత్వం ఉందని భావించి 1936లో ఆ విధానానికి స్వస్తి చెప్పారు. కెంటకీలో రెయినీ బెతియా అనే వ్యక్తిని ఉరి తీసినప్పుడు ఆయన వెన్నుపూస విరిగి నరక యాతన అనుభవించడంతో ఆ విధానం సరైనది కాదని న్యాయ నిపుణులు భావించారు. ఆ తర్వాత హఠాత్తుగా ఉరి బిగుసుకునేలా కాకుండా మెడకు తాడు కట్టి మెల్లగా వేలాడదీశేవారు. అలా నల్లజాతీయులనే ఎక్కువగా ఉరి తీశారు. 20 శతాబ్దం ఆరంబం నుంచి మరణ శిక్షల అమలుకు ప్రత్యామ్నాయ పద్ధతులను అన్వేషించడం ప్రారంభించారు. తొలి అన్వేషణలోనే ‘ఎలక్ట్రిక్‌ చైర్‌’ మరణ శిక్షను అమలు చేయడం మంచిదనిపిచ్చింది. ఈ పద్ధతిని 1890, ఆగస్టు ఆరవ తేదీన న్యూయార్క్‌ రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా  హంతకుడు విలియం కెమ్లర్‌కు అమలు చేశారు. ఎలక్ట్రిక్‌ చైర్‌ విధానం అమానుషమంటూ కెమ్లర్‌ పెట్టుకున్న పిటిషన్‌ను అమెరికా సుప్రీం కోర్టు కొట్టివేసింది. దేశవ్యాప్తంగా ఆ విధానాన్ని అనుసరించడమే ఉత్తమమని 20వ శాతాబ్దంతో న్యాయ నిపుణుల బృందాలు సూచించాయి. ఎలక్ట్రిక్‌ చేర్‌ వల్ల నరాలు కుంచించుకుపోయి ప్రాణం పోవడం కన్నా ముందే మెదడు పని చేయకుండా పోతుంది కనుక మరణ యాతన ఉండదనే ఉద్దేశంతో అదే మంచి పద్ధతని చాలాకాలం భావించారు. 

1980వ దశకం వరకు ఈ విధానం అమెరికా అంతటా కొనసాగింది. 1990లో ఒకసారి, 1997లో ఒకసారి మరణ శిక్ష అమలు సందర్భంగా ఎలక్ట్రిక్‌ చైర్‌లు అంటుకొని దోషులు మాడిపోవడంతో ఆ విధానం వివాదాస్పదం అయింది.  ఆ దేశంలో ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం స్వతంత్ర చట్టాలు చేసుకునే కొన్ని ప్రత్యేకాధికారాలు కూడా ఉండడంతో వర్జీరియా రాష్ట్రం 2013 వరకు కూడా దోషులకు మరణ శిక్షలు అమలు చేసేందుకు ఎలక్ట్రిక్‌ చైర్‌ విధానాన్నే అనుసరిస్తూ వచ్చింది. 

21వ శతాబ్దంలో గ్యాస్‌ చేంబర్లు
జార్జియాలోని సుప్రీం కోర్టు జస్టిస్‌ కరోల్‌ డబ్లూ అన్‌స్టెయిన్‌ ‘ఎలక్ట్రిక్‌ చైర్‌’ ద్వారా మరణ శిక్ష అమలు చేయడం కూడా ఉరి శిక్ష విధించడం లాంటి అమానుషమేనని తీర్పునివ్వడంతో మళ్లీ ప్రత్యామ్నాయాల గురించి ఆలోచించారు. 1922లో నేవడలో మొదటిసారి అమలు చేసిన గ్యాస్‌ చేంబర్‌ పద్ధతి మళ్లీ చర్చకు వచ్చింది. వెంటిలేటర్లులేని ఓ గదిలో దోషిని నిర్బంధించి నైట్రోజెన్‌ గ్యాస్‌ను పంపించి చంపడమే ఆ పద్ధతి. ఏ జైల్లోనూ ఈ పద్ధతిలో మరణ శిక్షను అమలు చేయడానికి సైరైన్‌ సదుపాయాలులేక విమర్శలు వెల్లువెత్తాయి. మరణ శిక్షను ప్రత్యక్షంగా వీక్షించిన సాక్షులు, జైల్లో ఉంటున్న ఇతర ఖైదీలు ఆ గ్యాస్‌ ప్రభావానికి లోనై దగ్గుతుండడం విమర్శలకు కారణం. 1924 నుంచి 1977 వరకు ఈ పద్ధతిన పలు రాష్ట్రాలు మరణ శిక్షలు అమలు చేశాయి. 22 ఏళ్ల తర్వాత ఆఖరి సారి 1999లో ఉపయోగించారు. మరోపక్క ప్రత్యామ్నాయంగా 1900 నుంచి 2010 వరకు ఫైరింగ్‌ స్క్వాడ్‌తో మరణశిక్షలు అమలు చేశారు. ఆ తర్వాత విషపు ఇంజెక్షన్ల ద్వారా మరణ శిక్ష అమలు చేయడం వచ్చింది. ట్రంప్‌ హయాంలో ఒక్క ఉరిశిక్ష తప్ప మరణ శిక్షలకు పాత పద్ధతులన్నీ మళ్లీ అమల్లోకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరిగాయి. 

మరిన్ని వార్తలు