అఫ్గన్‌లో మహిళల రక్షణపై మలాలా ఆందోళన

17 Aug, 2021 10:01 IST|Sakshi

లండన్‌: అఫ్గనిస్తాన్‌లో తాలిబన్లు అధికారం చేజి క్కించు కోవడంపై పాకి స్తానీ హక్కుల కార్యకర్త, నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసఫ్‌జాయ్‌(24) ఆందోళన వ్యక్తం చేశారు. ఆ దేశంలోని మహిళలు, మైనారిటీలు హక్కుల కార్యకర్తల రక్షణపై తీవ్ర ఆందోళన చెందుతు న్నట్లు ఆమె తెలిపారు. ఆదివారం ట్విట్టర్‌లో ఆమె..‘అఫ్గనిస్తాన్‌ను తాలిబన్లు సంపూర్ణంగా స్వాధీనం చేసుకోవడం చూసి షాక్‌కు గురయ్యాను. ఈ పరిస్థితుల్లో అక్కడి మహిళలు, మైనారిటీలు, హక్కుల కార్యకర్తల రక్షణపై తీవ్ర ఆందోళన చెందుతున్నాను’ అన్నారు.

‘ప్రపంచదేశాలు జోక్యం చేసుకుని అక్కడ తక్షణమే కాల్పుల విరమణ అమలయ్యేలా చూడాలి. శరణార్ధులు, పౌరులకు భద్రత కల్పించి, మానవతాసాయం అందజేయాలి’ అని ఆమె కోరారు. బాలికలు చదువుకోవాలంటూ పాక్‌లోని స్వాత్‌ ప్రాంతం లో ఉద్యమం చేపట్టిన మలాలాపై 2012లో తాలి బన్లు కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన ఆమె పాకిస్తాన్‌లో, అనంతరం యూకేలో చికిత్స పొందారు. ప్రస్తుతం యూకేలోనే ఉంటున్నారు. ఆమె పాకిస్తాన్‌ వస్తే చంపేస్తామంటూ తాలిబన్లు హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. 

అఫ్గాన్‌లో స్థిరత్వం ఏర్పడాలి: రైజీ 
కాబూల్‌: తాలిబన్‌ వశమైన అఫ్గనిస్తాన్‌లో స్థిరమైన పాలన ఏర్పడాలంటూ ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీమ్‌ రైజీ ఆకాంక్షించారు. అఫ్గన్‌లో స్థిరత్వం ఏర్పడేందుకు ఇరాన్‌ సహకరిస్తుందని, అదే తమ ప్రధమ ప్రాధాన్యమని పేర్కొన్నారు. అఫ్గన్‌ తమకు సోదరుడి వంటిదన్నారు. అమెరికన్‌ ఆర్మీ వైఫల్యం కావడంతోనే అఫ్గాన్‌ను విడిచి వెళ్లిందని వ్యాఖ్యానించారు. అమెరికా బలగాల నిష్క్రమణ వల్ల అఫ్గన్‌కు తిరిగి జీవం పోసేందుకు, స్థిరమైన శాంతిని నెలకొల్పేందుకు అవకాశం దక్కిందన్నారు. అధికారికంగా 8 లక్షల మంది, అనధికారికంగా 20 లక్షల మంది అఫ్గన్లు ఇరాన్‌లో శరణార్థులుగా ఉన్నారు.  

రక్షణ బాధ్యత అఫ్గన్లదే 
అమెరికా భద్రతా సలహాదారు సలివన్‌
వాషింగ్టన్‌/కాబూల్‌: అఫ్గనిస్తాన్‌ను తాలిబన్లు స్వల్ప వ్యవధిలోనే చేజిక్కించుకోవడానికి ఆ దేశ సైనిక బలగాల వైఫల్యమే కారణమని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్‌ సలివన్‌ నిందించారు. అఫ్గన్‌లో మూడో దశాబ్ది సంఘర్షణలోకి అమెరికా అడుగు పెట్టాలని అధ్యక్షుడు జో బైడెన్‌ కోరుకోవడం లేదని తెలిపారు. రెండు దశాబ్దాల పాటు అఫ్గన్‌ రక్షణ కోసం అమెరికా వందల కోట్ల డాలర్లు వెచ్చించిందని, అక్కడి సైనికులకు శిక్షణ ఇచ్చిందని గుర్తుచేశారు. ఇకపై స్వదేశాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత అఫ్గన్‌ సైన్యానిది, అక్కడి ప్రజలదేనని తేల్చిచెప్పారు. రాజధాని కాబూల్‌ విషయంలో తాలిబన్లతో పోరాటం వద్దని అఫ్గన్‌ సైనికులే నిర్ణయించుకున్నారని, అందులో తమ ప్రమేయం లేదని స్పష్టం చేశారు. తాలిబన్లపై సొంతంగా పోరాటం సాగించడానికి అఫ్గన్‌ సైన్యం సిద్ధంగా లేదన్నారు. కాబూల్‌లో పరిణామాలు కలచి వేస్తున్నప్పటికీ బైడెన్‌ నిర్ణయంలో మార్పు ఉండబోదని వివరించారు.
 

మరిన్ని వార్తలు