వీడియో: మసూద్‌పై చర్యలుంటాయా? భారత జర్నలిస్ట్‌ ప్రశ్నకు పాక్‌ ప్రధాని రియాక్షన్‌ ఏంటంటే..

17 Sep, 2022 13:12 IST|Sakshi

సమర్‌ఖండ్‌: పాకిస్తాన్‌ బుద్ధి మరోసారి.. అదీ అంతర్జాతీయ వేదికగా బయటపడింది. గ్లోబల్‌ టెర్రరిస్ట్‌, జైషే ముహమ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజార్‌ గురించి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేక నీళ్లు నమిలారు పాక్‌ ప్రధాని షెహ్‌బాజ్‌ షరీఫ్‌. 

ఉజ్బెకిస్తాన్‌ సమర్‌ఖండ్‌లో షాంగై కోఆపరేషన్‌ ఆర్గనైజేషన్‌(SCO) సదస్సుకు పాక్‌ ప్రధాని షెహ్‌బాజ్‌ షరీఫ్‌ హాజరయ్యారు. అయితే.. అంతర్జాతీయ మీడియాతో ముఖాముఖి సందర్భంగా ఆయన్ని ఇరకాటంలో పడేశాడు భారత జర్నలిస్ట్‌ ఒకరు. 

భారత్‌కు చెందిన ఓ మీడియా జర్నలిస్ట్‌.. ‘షరీఫ్‌ సాబ్‌.. మసూద్‌ అజార్‌ మీద ఒక చిన్నప్రశ్న. అతనికి వ్యతిరేకంగా మీ చర్యలు ఉంటాయా?’ అని ప్రశ్నించారు. అయితే.. దానికి సమాధానం ఇవ్వకుండా పక్కనే ఉన్న తన ప్రతినిధితో మాట్లాడుకుంటూ ముందుకెళ్లారు. అయితే అక్కడే ఉన్న ఆయన సిబ్బంది సదరు జర్నలిస్ట్‌ను మళ్లీ ఆ ప్రశ్న అడగకుండా నిలువరించే యత్నం చేశారు. ఇకచాలూ.. దయచేసి ఆపండి అంటూ సిబ్బందిలోని ఓ వ్యక్తి సదరు జర్నలిస్ట్‌కు సూచించారు కూడా. 

ఇదిలా ఉంటే.. భారత్‌ సహా పలుదేశాల్లో ఉగ్రదాడులకు పాల్పడిన జైషే ముహమ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజార్‌ను ఐక్యరాజ్య సమితి గ్లోబల్‌ టెర్రరిస్టుగా గుర్తించింది. అయితే.. ఈమధ్యే మసూద్‌ అఫ్గన్‌లో ఉన్నాడంటూ పాక్‌ ఆరోపించగా.. అలాంటి ఉగ్రసంస్థలను ఆదరించే ఘనత కేవలం పాక్‌కే ఉంటుందంటూ తాలిబన్లు సెటైర్లు వేశారు. 

ఇదీ చదవండి: మళ్లీ అక్కడ శవాల దిబ్బలే దర్శనమిస్తున్నాయి

మరిన్ని వార్తలు