ఘోర ప్రమాదం.. బస్సులో మంటలు.. 39 మంది దుర్మరణం

29 Jan, 2023 12:56 IST|Sakshi

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌లో ఆదివారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. క్వెట్టా నుంచి కరాచీ వెళ్తున్న బస్సు అదుపుతప్పి కాలువలో పడింది. ఈ ధాటికి మంటలు చెలరేగి బస్సు కాలిపోయింది. బలూచిస్తాన్ ప్రాంతంలోని లాస్‌బెలాలో జరిగిన ఈ విషాద ఘటనలో 39 ప్రయాణికులు దుర్మరణం చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

బస్సులో మొత్తం 48 మంది ప్రయాణికులున్నట్లు తెలుస్తోంది. డ్రైవర్ బస్సును వేగంగా నడిపాడని, ఈ క్రమంలోనే ఓ బ్రిడ్జి మలుపు వద్ద అదుపు తప్పి పిల్లర్‌ను ఢీకొట్టాడని అధికారులు తెలిపారు. అనంతరం బస్సు కాలువలోకి దూసుకెళ్లిందని వివరించారు. వెంటనే మంటలు చెలరేగి ప్రయాణికులు అగ్నికి ఆహుతైనట్లు తెలిపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మంటల్లో కాలిపోయిన వారిని గుర్తించేందుకు మృతదేహాలకు డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహిస్తున్నారు.
చదవండి: భారత సంతతి రాజా చారికి అమెరికా వైమానిక దళంలో కీలక పదవి!

మరిన్ని వార్తలు