న్యూయార్క్ : ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాన్కు మరోసారి చుక్కెదురైంది. భారతీయుల్ని తీవ్రవాదులుగా చిత్రీకరించే ప్రయత్నం ఘోరంగా విఫలమైంది. బుధవారం యూఎన్ 1267 కమిటీ ముందు వేణుమాధవ్ డోంగారా, అజయ్ మిస్త్రీ అనే ఇద్దరు భారతీయులను ఉగ్రవాదులుగా చిత్రీకరించేందుకు పాక్ ప్రయత్నించింది. అయితే పాక్ వాదనలకు సరైన ఆధారాలు చూపాలని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సభ్య దేశాలైన యూఎస్, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, బెల్జియంలు కోరాయి. ఈ నేపథ్యంలో పాక్ సరైన ఆధారాలు చూపలేకపోయింది. అంతటితో ఆగకుండా మరో ఇద్దరు భారతీయులు గోబింద పట్నాయక్, అంగార అప్పాజీలను కూడా ఉగ్రవాదులుగా చిత్రీకరించేందకు ప్రయత్నించింది. ( మళ్లీ మాట మార్చిన పాకిస్తాన్ )
ఈ ప్రయత్నాన్ని కూడా భద్రతా మండలి సభ్యదేశాలు తిప్పికొట్టాయి. దీనిపై యూన్లోని భారత శాశ్వత ప్రతినిధి టీఎస్ తిరుమూర్తి ట్విటర్ వేదికగా స్పందించారు.. ‘‘ ఉగ్రవాదానికి మతపరమైన రంగు పులమటం ద్వారా 1267 కమిటీ ప్రత్యేక చర్చల్ని రాజకీయం చేయడానికి పాకిస్తాన్ చేసిన ప్రయత్నాన్ని యూఎన్ భద్రతా మండలి అడ్డుకుంది. పాకిస్తాన్ చర్యల్ని తిప్పికొట్టిన భద్రతా మండలి సభ్య దేశాలకు ధన్యవాదాలు’’ అని పేర్కొన్నారు.