ఇమ్రాన్‌పై ప్రశ్నల వర్షం.. పిల్లల ప్రాణాలు తీసేవారితో చర్చలా?

11 Nov, 2021 05:35 IST|Sakshi

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌ తాలిబన్ల పార్టీ అయిన తెహ్రీక్‌ ఇ తాలిబన్‌ పాకిస్తాన్‌(టీటీపీ)తో పాక్‌  కాల్పుల విరమణ ఒప్పందం చేసుకున్న ఒక్కరోజు తర్వాత ఆ సంస్థ చేసిన ఊచకోతపై ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ను ఆ దేశ సుప్రీంకోర్టు ప్రశ్నించింది. 2014లో ఆర్మీ ఆధ్వర్యంలో నడిచే స్కూలుపై ఈ ఉగ్రసంస్థ జరిపిన హేయమైన దాడిలో 150 మంది మరణించారు. ఈ ఘటనకు సంబంధించి ఇమ్రాన్‌ బుధవారం సుప్రీంకోర్టు విచారణకు హాజరయ్యారు.

ఈ సందర్భంగా కోర్టు ఇమ్రాన్‌పై ప్రశ్నల వర్షం కురిపించింది. చిన్నారుల ప్రాణాలను బలి తీసుకున్న వారికి మీరు మోకరిల్లుతారా అని ప్రశ్నించింది. ‘మీరు అధికారంలో ఉన్నారు. ఏం చేస్తున్నారు ? ఆ దోషులతో తీరిగ్గా చర్చలు జరుపుతున్నారు’ అని సీజే అహ్మద్‌ ప్రధానిని నిలదీశారు. ఆనాడు తాము అధికారంలో లేమని, బాధిత కుటుంబాలకు నష్టపరిహారం కింద ఆర్థికసాయం చేశామని ఇమ్రాన్‌ బదులిచ్చారు. విద్యార్థుల తల్లిదండ్రుల గాయాలపై కారం రాసినట్టుగా ప్రధాని మాటలు ఉన్నాయంటూ  ప్రధాన న్యాయమూర్తి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు