Pakistan Political Crisis: అసలు పాకిస్తాన్‌లో ఏం జరుగుతోంది!.. 5 కీలక అంశాలు ఇవే

3 Apr, 2022 15:24 IST|Sakshi

Pakistan Political Crisis: పాకిస్తాన్‌లో ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రభుత్వానికి విపక్షాల మధ్య మొదలైన యద్ధం రసవత్తరంగా మారుతోంది. ఇమ్రాన్‌ఖాన్‌పై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని స్పీకర్‌ తిరస్కరించారు.  కాగా, అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే క్రమంలో జాతీయ అసెంబ్లీకి ఇమ్రాన్‌ఖాన్‌ హాజరు కాలేదు. అదే సమయంలో జాతీయ అసెంబ్లీని రద్దు చేయాలని ఇమ్రాన్‌ఖాన్‌ సిఫారుసు చేశారు. అంటే అవిశ్వాస తీర్మానం కాకుండా నేరుగా ఎన్నికలకు వెళ్లాలని ఇమ్రాన్‌ భావిస్తున్నారు. ఈ అనూహ్య నిర్ణయం ద్వారా ప్రతిపక్షాలకు పెద్ద షాక్ తగిలింది. అంతేకాకుండా ఇమ్రాన్‌ఖాన్‌కు పదవీ గండం తప్పింది. ప్రస్తుతం పాక్‌లోని రాజకీయ సంక్షోభంలో 5 కీలక అంశాలు ఇవే..

1.ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రభుత్వానికి చెందిన 12 మందికి పైగా శాసనసభ్యులు, అలానే పార్టీలో కీలకంగా ఉన్న ప్రతిపక్షాలకు మద్దతు తెలిపే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. గత వారం, ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ పార్టీ 342 మంది సభ్యులతో కూడిన పార్లమెంట్‌లో మెజారిటీని కోల్పోయింది. ప్రభుత్వం కొనసాగాలంటే 172 మంది సభ్యుల బలాన్ని ఇమ్రాన్‌ ప్రభుత్వం నిరూపించుకోవాల్సి ఉంది.

2. జాతీయ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ సాదిక్ సంజరానీ ఈ అవిశ్వాస తీర్మానమంతా విదేశీ కుట్ర అని ఆరోపిస్తూ సభను రద్దు చేశారు. అవిశ్వాస తీర్మానం రాజ్యాంగ విరుద్ధం అని అన్నారు.

3.ఇమ్రాన్ ఖాన్ జాతినుద్దేశించి ప్రసంగిస్తూ..  పాకిస్తాన్ ప్రజలను ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని కోరారు. ఈ ప్రభుత్వాన్ని కూల్చివేయాలనే ప్రతిపక్షాల కుట్ర భగ్నమైందని ఆయన అన్నారు.

4. ‘ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఉల్లంఘించింది. అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌కు అనుమతించలేదు. ఉమ్మడి ప్రతిపక్షాలు పార్లమెంటును విడిచిపెట్టడం లేదు. ఈ అంశంపై మా న్యాయవాదులు సుప్రీంకోర్టుకు వెళ్తున్నారు’.. అని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) నాయకుడు బిలావల్ భుట్టో జర్దారీ ట్వీట్ చేశారు. 

5.పాకిస్థాన్ వ్యవహారాల్లో అమెరికా జోక్యం చేసుకుంటోందని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. రష్యా, చైనాలకు వ్యతిరేకంగా ప్రపంచ సమస్యలపై అమెరికా యూరప్ తరపున మాట్లాడనందుకే ఈ పరిణామాలని వివరించారు. ఈ కారణంతోనే ప్రతిపక్షాలు తనను తొలగించడానికి  అమెరికాతో కలిసి కుట్ర పన్నుతున్నాయని ఇమ్రాన్‌ ఆరోపించారు.

ఇదిలా ఉండగా ఇమ్రాన్‌ ఖాన్‌ సిపారసుతో జాతీయ అసెంబ్లీ(పార్లమెంట్‌)ను ఆ దేశాధ్యక్షుడు అరిఫ్‌ అల్వీ రద్దు చేయడంతో ముందస్తు ఎన్నికలకు పిలుపు నిచ్చారు. దీంతో పాక్‌లో ముందుస్తు ఎన్నికలు జరగడం ఖాయమైంది.

చదవండి: Social Media Ban in Sri Lanka: శ్రీలంకలో ఆంక్షలు.. అల్లాడుతున్న లంకేయులు

మరిన్ని వార్తలు