అఫ్గన్‌లో ప్రభుత్వ ఏర్పాటు: రంగంలోకి దిగిన పాక్‌

4 Sep, 2021 17:44 IST|Sakshi

కాబూల్‌ చేరుకున్న ఐఎస్‌ఐ లెఫ్టినెంట్‌ జనరల్‌ ఫెయిజ్‌ హమీద్‌

కాబూల్‌: అఫ్గనిస్తాన్‌ను వశం చేసుకున్న తాలిబన్ల పట్ల మొదటి నుంచి సానుకూలంగా ఉన్న చైనా.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. చైనా తన నమ్మినబంటు పాకిస్తాన్‌ సాయంతో అఫ్గనిస్తాన్‌లో తాలిబన్ల రాజ్యం ఏర్పాటు చేసేందుకు సాయం చేస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. ఈ వార్తలకు బలం చేకూరుస్తూ.. పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్‌ఐ) లెఫ్టినెంట్‌ జనరల్‌ ఫైజ్‌ హమీద్‌ శనివారం కాబూల్‌ చేరుకున్నాడు. అఫ్గన్‌లో తాలిబన్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సాయం చేయడమేకాక ముల్లా యాకూబ్‌ నేతృత్వంలోని కాందహరీలు, సిరాజుద్దీన్‌ హక్కానీ అధ్వర్యంలోని కాబూలీల మధ్య తలెత్తిన అంతర్గత సమస్యల పరిష్కరించడానికి హమీద్‌ ప్రయత్నించనున్నట్లు తెలిసింది.

అలానే పాక్‌.. అఫ్గన్‌ ఆర్మీలో హక్కానీలను ప్రవేశపెట్టడానికి పాక్‌ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు సమచారం. ఐఎస్‌ఐ, హక్కానీ నెట్‌వర్క్ పోషకుడిగా పరిగణించబడుతుంది. అంతేకాక ఇది అమెరికా, ఐక్యరాజ్య సమితి హక్కానీని తీవ్రవాద గ్రూపుగా ప్రకటించింది. అంతేకాక ఇది అల్ ఖైదాకు సంబంధించిన సంస్థగా ప్రకటించింది. ఈ క్రమంలో పాకిస్తాన్‌ ప్రయత్నాల పట్ల అఫ్గన్‌ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాలిబన్ల ప్రధాన సంస్థ పాకిస్తాన్‌లో ఉన్నట్లు గతంలో అఫ్గన్‌ ప్రభుత్వం, అమెరికా ఆరోపించినప్పటికి.. పాక్‌ వాటిని కొట్టి పారేసిన సంగతి తెలిసిందే. (చదవండి: క్రికెట్‌ మ్యాచ్‌లో అత్యద్భుత దృశ్యం.. అఫ్గాన్‌, తాలిబన్‌ జెండాలతో..?)

తాలిబన్లు తాము అఫ్గన్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినట్లు ప్రకటించడంపై అక్కడ తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. ఈ నేపథ్యంలో హమీద్‌ కాబూల్‌ పర్యటన ప్రధాన్యత సంతరించుకుంది. అయితే హమీద్‌ పర్యటన గురించి ఎలాంటి అధికారక ప్రకటన లేదు. ప్రభుత్వం ఏర్పాటు చేసే అంశంలో తాలిబన్‌ నాయకత్వానికి సాయం చేయడానికే హమీద్‌ కాబూల్‌ వచ్చాడని మీడియా వర్గాలు వెల్లడించాయి. (చదవండి: తాలిబన్లకు చైనా మరింత మద్దతు, కీలక హామీ )

అయితే ఈ మొత్తం వ్యవహారంలో చైనా ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. డ్రాగన్‌ దేశం పాకిస్తాన్‌ను ట్రంప్‌కార్డ్‌గా వాడుకుని.. తాలిబన్లకు రహస్యంగా సాయం చేస్తుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అఫ్గన్‌లో తాలిబన్ల అరాచకాలు మొదలైన వెంటనే అన్ని దేశాలు అక్కడ తమ రాయబార కార్యాలయాలను మూసి వేసినప్పటికి చైనా మాత్రం ఆ పని చేయలేదు. అంతేకాక ప్రస్తుతం చైనానే తమను ఆర్థికంగా ఆదుకుంటుందని తాలిబన్లు భావిస్తున్నారు. అలానే అఫ్గన్‌లోని విస్తారమైన విస్తారమైన రాగి, లిథియం గనులను దృష్టిలో పెట్టుకుని.. డ్రాగన్‌ అఫ్గనిస్తాన్‌ కోసం ఉద్దేశించిన బెల్ట్‌ రోడ్‌ పనులను కొనసాగించనున్నట్లు తెలిపింది. 

చదవండి: అఫ్గన్‌ వాసుల తాకిడితో చమన్‌ సరిహద్దులను మూసివేసిన పాక్‌

మరిన్ని వార్తలు