ఛీ..ఛీ మీకిదేం పాడు బుద్ది

27 Apr, 2021 17:00 IST|Sakshi

విదేశాల్లో పాక్‌ దౌత్యవేత్తల చేతి వాటం

చాక్లెట్స్‌, టోపీ దొంగిలించిన అధికారులు

ఇస్లామాబాద్‌: దౌత్యవేత్త అంటే ఎంతో బాధ్యతగా మెలగాలి. ఓ దేశ పరువు ప్రతిష్టలు వారి భుజాల మీద ఉన్నట్లు అర్థం.  అందుకే వారు తమ మాటలు, చేతలు విషయంలో చాగా జాగ్రత్తగా ఉండాలి. స్వదేశంలో ఎలా ఉన్నా ఏం కాదు.. కానీ విదేశాలకు వెళ్లినప్పడు ఏ చిన్న తప్పు చేసినా.. దేశ ప్రతిష్టకు భంగం కలగకమానదు. అలాంటిది పాకిస్తాన్‌ దౌత్యవేత్తలు ఇద్దరు విదేశీ పర్యటనలో తన చేతివాటం చూపారు. చాక్లెట్స్‌, టోపీ దొంగిలించి అడ్డంగా బుక్కయ్యారు. దక్షిణ కొరియా పర్యటనలో సదరు అధికారులు ఈ పని చేశారు.

కొరియా టైమ్స్‌ రిపోర్ట్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఇద్దరు పాక్‌ దౌత్యవేత్తలు ఈ ఏడాది జనవరి 10న, ఫిబ్రవరి 23న దక్షిణ కొరియాలో పర్యటించారు. ఈ సందర్భంగా తొలుత కొరియా వెళ్లిన అధికారి సుమారు 750 రూపాయలు విలువ చేసే టోపి దొంగతనం చేయగా.. మరొకరు సుమారు వంద రూపాయలు విలువ చేసే చాక్లెట్స్‌ దొంగిలించినట్లు కొరియా అధికారులు తెలిపారు. ఇక అధికారుల చేతి వాటానికి సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ టీవీకెమరాల్లో రికార్డయ్యాయి. 

ఇక దొంగతనం జరిగిన షాపు యమజానులు దీని గురించి పోలీసులుకు ఫిర్యాదు చేయడంతో సదరు అధికారుల చేతి వాటం బయటపడింది. దర్యాప్తు తరువాత, దౌత్యపరమైన ప్రోటోకాల్‌ కారణంగా అధికారులు సదరు నిందితులపై కేసు బుక్ చేయకుండా వదిలేశారు. దౌత్య సంబంధాలపై వియన్నా కన్వెన్షన్ ప్రకారం, దౌత్యవేత్తలు, వారి కుటుంబాలు తమ ఆతిథ్య దేశంలో అరెస్టు, నిర్బంధం, నేరారోపణల నుంచి మినాహాయింపు పొందవచ్చు.

చదవండి: పావురంపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు..ఎందుకో తెలుసా?

మరిన్ని వార్తలు