జెలెన్‌ స్కీతో ఫోన్‌లో సంభాషించిన మోదీ: శ‍త్రుత్వాన్ని వీడాలని హితవు

4 Oct, 2022 20:38 IST|Sakshi

న్యూఢిల్లీ: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ తమ భూభాగాల రక్షణ కోసమే ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్నామని అవసరమనుకుంటే అణుదాడికి కూడా దిగుతామని కరాఖండిగా చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌ స్కీతో మోదీ ఫోన్‌లో మాట్లాడారు. అదీకూడా పుతిన్‌ పెద్ద సంఖ్యలో బలగాలను సమీకరిస్తానని బహిరంగా ప్రకటించిన రెండు వారాల తర్వాత ఇరు నాయకులు ఫోన్‌లో సంభాషించుకోవడం విశేషం.

పైగా పుతిన్‌ తమ దాడిని ముఖ్యంగా నాటో సభ్య దేశాలైన యూఎస్‌ దాని మిత్రదేశాలకు వ్యతిరేకంగా చేస్తున్న గొప్ప యుద్ధంగా అభివర్ణించుకున్నాడు కూడా. ఈ మేరకు ఫోన్‌లో మోదీ....ఉక్రెయిన్‌లో తూర్పు ప్రాంతాల రష్యా బలగాల దాడి గురించి ప్రస్తావిస్తూ...అణుదాడుల విషయమై ఆందోళన వ్యక్తం చేశారు. పైగా ఇరు దేశాల నాయకులు శత్రుత్వాన్ని విరమించుకోవాలని హితవు పలికారు. చర్చలు, దౌత్యమార్గాల ద్వారా సమస్యని పరిష్కరించుకోవాల్సిందిగా పునరుద్ఘాటించారు. వివాదానికి ఎప్పుడూ సైనిక పరిష్కారం ఉండదని కూడా దృఢంగా చెప్పారు. అలాగే ఎలాంటి శాంతి ప్రయత్నాలకైనా సహకరించేందుకు భారత్‌ ఎప్పుడూ సంసిద్ధంగా ఉంటుందని తెలియజేసినట్లు ప్రధాని మంత్రి కార్యాలయం పేర్కొంది. 

(చదవండి: బంగ్లాదేశ్‌లో సగం పైగా జనాభా అంధకారంలోనే...)

మరిన్ని వార్తలు