భారత్, బంగ్లా మధ్య ఏడు ఒప్పందాలు

18 Dec, 2020 05:32 IST|Sakshi
డిజిటల్‌ ఎగ్జిబిషన్‌ను ప్రారంభిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ, షేక్‌ హసీనా

ఒప్పందాలు కుదరడం గర్వకారణం: మోదీ

భారత్‌ మాకు నిజమైన మిత్రదేశం: షేక్‌ హసీనా   

ఢాకా: భారత్, బంగ్లాదేశ్‌ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడనున్నాయి. మొత్తం ఏడు రంగాల్లో పరస్పర సహకారం కోసం ఇరుపక్షాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ప్రధాని మోదీ, బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా మధ్య గురువారం జరిగిన ఆన్‌లైన్‌ సదస్సులో ఈ మేరకు ఒప్పందాలు కుదిరాయి. ఇరు దేశాల మధ్య గత 55 ఏళ్లుగా నిలిచిపోయిన రైలు మార్గాన్ని సైతం పునరుద్ధరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. పాక్‌పై జరిగిన యుద్ధంలో బంగ్లాదేశ్‌ విజయం సాధించి 50 ఏళ్లవుతున్న సందర్భంగా విజయ్‌ దివస్‌ జరుపుకుంటున్న వేళ భారత్, బంగ్లాల మధ్య ఒప్పందాలు కుదరడం గర్వకారణమని ప్రధాని మోదీ చెప్పారు. భారత జాతిపిత మహాత్మాగాంధీ, బంగ్లాదేశ్‌ వ్యవస్థాపకుడు షేక్‌ ముజిబీర్‌ రెహ్మాన్‌ జీవితాలను ఆవిష్కరించే డిజిటల్‌ ఎగ్జిబిషన్‌ను ప్రధానులిద్దరూ సంయుక్తంగా ప్రారంభించారు. హైడ్రోకార్బన్స్, వ్యవసాయం, ఇంధనం, టెక్స్‌టైల్స్‌ రంగాల్లో పరస్పర సహకారంతో పాటు సరిహద్దుల్లో ఏనుగుల సంరక్షణ, బంగ్లాకు చెత్తను శుద్ధి చేసే పరికరాల ఎగుమతి వంటి వాటిపై ఒక అవగాహనకు వచ్చాయి.  

భారత్‌కు కృతజ్ఞతలు: హసీనా  
భారత్‌ తమకు అసలైన మిత్రదేశమని షేక్‌ హసీనా అన్నారు. 1971లో పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధంలో అండదండలు అందించినందుకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
 

మరిన్ని వార్తలు