పీఎన్‌బీ కుంభకోణం: కొత్త ట్విస్ట్‌

25 May, 2021 09:30 IST|Sakshi

న్యూఢిల్లీ: సంచలనం సృష్టించిన పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు(పీఎన్‌బీ) కుంభకోణం కేసులో కొత్త ట్విస్ట్‌ చోటుచేసుకుంది. దేశం విడిచి పరారైన వజ్రాల వ్యాపారి మెహుల్‌ చోక్సీ కనిపించకుండాపోయారు. అంటిగ్వా దీవిలో తలదాచుకుంటున్న చోక్సీ.. కనిపించకుండా పోయారని ఆయన తరపు న్యాయవాది విజయ్‌ అగర్వాల్‌ వెల్లడించాడు. చోక్సీ అదృశ్యం నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఆదివారం రాత్రి ఓ రెస్టారెంట్‌లో విందు కోసం చోక్సీ వెళ్లినట్లు అక్కడి మీడియా వర్గాలు పేర్కొన్నాయి. 

అయితే చోక్సీ వాహనాన్ని రెస్టారెంట్‌ సమీపంలోని జాలీ హార్బర్‌లో గుర్తించినట్లు అంటిగ్వా పోలీసులు వెల్లడించారు. దీంతో అంటిగ్వా పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేసి ఆయన కోసం వెతుకుతున్నారు. అయితే ఇండియాకు అప్పగిస్తారనే భయంతోనే ఆయన పరారైనట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బహుశా ఆయన క్యూబాకి పారిపోయి ఉంటారని ఓ అధికారి చెప్తున్నారు. ఇండియాకు క్యూబాకు మధ్య నేరస్తుల అప్పగింతల ఒప్పందాలేవీ లేవు. అందుకే అక్కడికి వెళ్లి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.

చదవండి: నిర్మాత అత్యాచారం, ఆపై గర్భం..   

2017లో మెహుల్‌ చోక్సీ అంటిగ్వా, బార్బుడా పౌరసత్వం తీసుకున్నాడు. 2018లో పీఎన్‌బీ కుంభకోణం బయటపడడంతో నీరవ్‌మోదీతోపాటు మెహుల్‌ చోక్సీ దేశం విడిచి పారిపోయాడు. నీరవ్‌ మోదీ, మెహుల్‌ చోక్సీ ఇద్దరూ బంధువులు. కాగా, మెహుల్‌ అప్పగింత అంశంపై అక్కడి పీఎం గాస్టోన్‌ బ్రౌన్‌ ఇదివరకే భారత ప్రధాని మోడీతో ఫోన్‌లో మాట్లాడారు కూడా.

మరిన్ని వార్తలు