‘మీడియా దాడితో ఈ క్షణం దాకా బాధపడుతున్నా!’

6 Jun, 2023 19:43 IST|Sakshi

లండన్‌: బ్రిటన్‌ రాజకుటుంబంలో వందేళ్ల తర్వాత ఓ కీలక పరిణామం జరిగింది. సుమారు 130 ఏళ్ల తర్వాత..  తొలిసారి ఈ రాజకుటుంబానికి చెందిన ఓ వ్యక్తి కోర్టుకు హాజరయ్యారు. అతనే ప్రిన్స్‌ హ్యారీ(38). కింగ్‌ ఛార్లెస్‌ రెండో తనయుడు. ఫోన్‌ హ్యాకింగ్‌కు సంబంధించిన కేసులో ఓ వార్తా సంస్థకు వ్యతిరేకంగా మంగళవారం కోర్టు బోనులో నిలబడి సాక్ష్యం చెప్పాడు హ్యారీ. 

మీడియా దాడితో నేను జీవితాంతం బాధపడుతున్నా. కొన్ని టాబ్లాయిడ్లు, ఛానెల్స్‌, వెబ్‌సైట్లు.. తమ చేతులకు రక్తపు మరకలు అంటించుకుని తిరుగుతున్నాయి. వాళ్ల నిరంతర టీఆర్పీ రేటింగ్‌.. రీడర్‌షిప్‌ల దాహార్తికి నన్ను ఇబ్బంది పెడుతూ వస్తున్నారు. అది నేటి వరకు.. ఈ క్షణం దాకా కూడా.. అంటూ తీవ్ర అసహనం​ వ్యక్తం చేశారాయన. తనను చెడ్డొడిగా చూపిస్తూ బ్రిటన్‌ మీడియా లాభపడుతోందంటూ ఆరోపించారాయన. 

ప్రత్యక్ష సాక్షి హోదాలో కోర్టు బోనెక్కిన ప్రిన్స్‌ ఛార్లెస్‌.. ఎవరైనా ఈ మీడియా పిచ్చికి అడ్డుకట్ట వేయకముందే వాళ్ల టైపింగ్ వేళ్లను ఎంత రక్తం ముంచేస్తుందో అంటూ తనపై వస్తున్న కథనాలపై ఆందోళన వ్యక్తం చేశారాయన. ప్లేబాయ్‌ ప్రిన్స్‌, ఫెయిల్యూర్‌, డ్రాప్‌అవుట్‌, మోసగాడు, తాగుబోతు, ఏమాత్రం బాధ్యత లేని వ్యక్తి.. ఇలా ఆ మీడియా తనపై అల్లిన కథనాల జాబితా పెద్దదేనంటూ కోర్టుకు తెలిపారాయన. టీనేజర్‌గా ఉన్నప్పుడు, ట్వంటీస్‌లో ఉన్నప్పుడు.. మీడియా నీచమైన రాతలను తాను చూడాల్సి వచ్చిందంటూ ఆవేదన వ్యక్తం చేశారాయన. 

ఇదిలా ఉంటే.. బ్రిటన్‌కు చెందిన మిర్రర్‌ గ్రూప్‌ రాజకుటుంబం సహా అనేక మంది ప్రముఖుల వ్యక్తిగత విషయాలను సేకరించేందుకుగానూ చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిందనే ఆరోపణలు ఉన్నాయి. అందులో ఒకటే ఈ ఫోన్‌ హ్యాకింగ్‌ కేసు. ప్రిన్స్‌ హ్యారీతో పాటు పలువురు ప్రముఖులు ఈ వ్యవహారంపై సదరు మీడియా హౌజ్‌ను కోర్టుకు లాగారు. 

ఇక రాజకుటుంబానికి దూరంగా.. తన భార్య మేఘన్‌ మర్కెల్‌, పిల్లలతో కలిసి అమెరికాలో ఉంటున్నాడు ప్రిన్స్‌ హ్యారీ. సోమవారమే లండన్‌ చేరుకున్నప్పటికీ.. భారత కాలమానం ప్రకారం ఈ ఉదయం న్యాయస్థానంలో హాజరు అయ్యారు. తన వ్యక్తిగత వివరాలను సేకరించేందుకు మిర్రర్‌ గ్రూప్‌ ఉపయోగించిన మోసపూరిత పద్ధతుల కారణంగా తన జీవితం ఎలా అతలాకుతలం అయ్యిందో హ్యారీ.. న్యాయమూర్తికి వివరించారు.  చట్టవ్యతిరేకంగా సేకరించిన వివరాలతో.. 140 ఆర్టికల్స్‌ను ప్రచురించారని, ఒకానొక టైంలో ప్రైవేట్‌ ఇన్వెస్టిగేటర్లను సైతం ఉపయోగించారని హ్యారీ కోర్టుకు వివరించారు.

130 ఏళ్ల కిందట ఆయన.. 
బ్రిటన్‌ రాజకుటుంబానికి చెందిన వ్యక్తులు కోర్టుకు హాజరవ్వడం 130 ఏళ్లలో ఇదే తొలిసారి. అంతకుముందు 1870లో ఓ విడాకుల కేసుకు సంబంధించి ఎడ్వర్డ్‌ VII కోర్టుకు హాజరై సాక్ష్యం చెప్పారు. ఆ తర్వాత 1891లో ఓ గ్యాంబ్లింగ్‌ కేసులోనూ ఇంగ్లీష్‌ హైకోర్టుకు వెళ్లి సాక్ష్యమిచ్చారు. అయితే, ఆయన రాజు కాకమునుపే ఈ రెండూ జరిగాయి.

మరిన్ని వార్తలు